Begin typing your search above and press return to search.

ఆ రెండు సినిమాలను నిర్మిస్తున్నందుకేనా దాసరికి టీటీడీ సభ్యత్వం?

By:  Tupaki Desk   |   19 Dec 2022 6:30 AM GMT
ఆ రెండు సినిమాలను నిర్మిస్తున్నందుకేనా దాసరికి టీటీడీ సభ్యత్వం?
X
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దాసరి కిరణ్‌ కుమార్‌ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిగా నియమితులయిన సంగతి తెలిసిందే. దీన్ని పురస్కరించుకుని సాక్షి దినపత్రికకు దాసరి కిరణ్‌ కుమార్‌ కోట్ల రూపాయలు విలువ చేసే యాడ్స్‌ ఇచ్చారు. అలాగే తన పదవీ ప్రమాణస్వీకార మహోత్సవానికి సైతం ఆయన భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాసరి కిరణ్‌కుమార్‌ రూ.1.5 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇందులో సాక్షి దినపత్రికకు ఫుల్‌ పేజీలో ఇచ్చిన యాడ్‌ కూడా కలిపి ఉందంటున్నారు.

కాగా తెనాలి చిరంజీవి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా దాసరి కిరణ్‌ కుమార్‌ రంగప్రవేశం చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లో భారీ ఎత్తున చిరంజీవి ఫ్యాన్స్‌ను దాసరి చేరదీశారు. అదే ఊపులో 2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి దృష్టిలో పడ్డారు. గుంటూరు జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా దాసరి కిరణ్‌ కుమార్‌ను వైఎస్సార్‌ నియమించారు.

2009లో చిరంజీవి పార్టీ పెట్టినా దాసరి కిరణ్‌ పదవిని విడిచిపెట్టలేదు. తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని తేల్చిచెప్పారు. దీంతో అతడిని చిరంజీవి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ను తప్పించారు. అయితే ఆ తర్వాత వైఎస్సార్‌ మరణించడంతో దాసరి కిరణ్‌ను ఎవరూ పట్టించుకోలేదు. కాంగ్రెస్‌ యువజన అధ్యక్షుడిగా ఉన్న పదవి కూడా మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది.

మళ్లీ చిరంజీవి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌కు దగ్గరయ్యేందుకు చేసిన ప్రయత్నాలను మెగా బ్రదర్‌ నాగబాబు అడ్డుకున్నారు. ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమైన దాసరి కిరణ్‌ కుమార్‌.. రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో వంగవీటి చిత్రాన్ని నిర్మించారు.

ప్రస్తుతం రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చే ఎన్నికల నేపథ్యంలో వస్తున్న వ్యూహం, శపథం సినిమాలను దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మిస్తున్నట్టు టాక్‌. వైఎస్‌ జగన్‌ బయోపిక్‌గా వ్యూహం సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తనపై రెండు సినిమాలను నిర్మిస్తున్న దాసరి కిరణ్‌కు జగన్‌ టీటీడీ సభ్యత్వం కట్టబెట్టారని చెప్పుకుంటున్నారు.

మరోవైపు దాసరి కిరణ్‌కు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో బాలశౌరి తెనాలి ఎంపీగా పనిచేసిన సమయంలో దాసరి కిరణ్‌.. బాలశౌరితో సన్నిహితంగా వ్యవహరించారు. దీంతో టీటీడీ సభ్యత్వం దక్కడం వెనుక బాలశౌరి సైతం క్రియాశీలక పాత్ర పోషించారని టాక్‌ నడుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.