Begin typing your search above and press return to search.

బిల్లు వెనుక కేవీపీ లెక్కేంటో తెలుసా?

By:  Tupaki Desk   |   2 Aug 2016 5:30 PM GMT
బిల్లు వెనుక కేవీపీ లెక్కేంటో తెలుసా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేకహోదా విష‌యంలో కేంద్ర మొండిచేయి చూప‌డంతో ఇపుడు ఏపీ భ‌గ్గుమంటోంది. కేంద్రం తీరుపై ఏపీ ప్ర‌జానికం వివిధ రూపాల్లో నిర‌స‌న‌లు మొద‌లుపెట్టింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌ కు బీజం వేసింది కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. రాజ్యసభలో ఆయ‌న‌ ప్రవేశ‌పెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై స్పందిస్తూ కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్‌ జైట్లీ హోదాకు నో చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే కేవీపీ బిల్లు వెనుక చాలా లాజిక్‌ లు ఉన్నాయ‌ని అంటున్నారు.

రాజ్య‌స‌భ‌లో చాలాకాలం క్రితమే ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం కేవీపీ ప్రైవేటు మెంబ‌ర్ బిల్లు ప్రవేశపెట్టారు. అప్పటి నుండి సదరు బిల్లు అనేక అడ్డంకులను దాటుకుని చర్చ దాకా వచ్చింది. ఎప్పుడైతే ప్రత్యేకహోదా అంశంపై రాజ్యసభలో చర్చ మొదలైందో అప్పటి నుండి మిత్రపక్షాలైన భారతీయ జనతా పార్టీ- తెలుగుదేశం పార్టీల బంధం మధ్య చీలిక మొదలైంది. మొదట్లో ఆ బిల్లును టీడీపీ - భాజపాలు చాలా తేలిగ్గా తీసుకున్నాయి. అయితే - బిల్లుపై చర్చకు రాజ్యసభ వైస్ ఛైర్మన్ తేదీ - సమయం ప్రకటించారో అప్పటి నుండే వేడి మొదలైంది. చాపక్రింద నీరులా కేవీపీ జాతీయ స్ధాయిలోని రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టటం మొదలుపెట్టారు. అందుకు పార్టీగా కాంగ్రెస్ కూడా శక్తివంతన లేకుండా సహకరించింది. దాంతో బిల్లుపై జాతీయ స్ధాయి పార్టీల్లో కూడా మద్దతు లభించింది. ఈ ప‌రిణామాన్ని మిత్రపక్షాలు రెండూ ఊహించని నేప‌థ్యంలో రెండు పార్టీల విషయంలో ఏకు మేకై కూర్చుంది. దాంతో ప్రజల దృష్టిలో దోషి కాకూడదన్న ఉద్దేశంతోనే ఇపుడు రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు - ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ఏపీ వ్యాప్తంగా టీడీపీ-బీజేపీలు ఇరుకున ప‌డ‌గా...కాంగ్రెస్ పోరాటం చేసిన పార్టీగా చ‌ర్చ‌ల్లో నిలుస్తోంది.

స‌రిగా ఈ లాజిక్‌ ను ప‌ట్టుకునే కేవీపీ ముందుకు సాగాడ‌ని అంటున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వటం సాధ్యం కాదన్న విషయాన్ని కేంద్రప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. అయినా సరే కేవీపీ ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టటం ద్వారా రాష్ట్రంలోని అన్నీ పార్టీలను ఇరుకునపెట్టాలనుకున్నారు. ఒకవేళ ఈ బిల్లుపై ఎటువంటి ఫలితం రాకున్నా ఈ స్ధాయిలో కేంద్రంలోను - రాష్ట్రంలోను అధికారంలో ఉన్న పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేట్లు చేయటంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ సఫలీకృతం అవుతుంద‌నేది కేవీపీ లాజిక్‌. ఏక‌కాలంలో ఇటు కాంగ్రెస్‌ను బ‌లోపేతం చేయ‌డం - అటు అధికారంలో ఉన్న టీడీపీ-బీజేపీల‌ను ఇర‌కాటంలో ప‌డేయ‌టం ఆయ‌న టార్గెట్‌. ఇపుడు స‌రిగ్గా అదే జ‌రుగుతోంది. ఏమో....భ‌విష్యత్తులో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లే కాంగ్రెస్ పార్టీకి ఊపిరిలూదుతుంది కావ‌చ్చు. వేచి చూడాల్సిందే.