Begin typing your search above and press return to search.

కిడారి అంత్యక్రియలకు లోకేశ్ ఎందుకు రాలేదు?

By:  Tupaki Desk   |   25 Sept 2018 9:51 AM IST
కిడారి అంత్యక్రియలకు లోకేశ్ ఎందుకు రాలేదు?
X
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు - మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల అంత్యక్రియలు టీడీపీ పెద్దలు రాకపోవడం ఆ పార్టీలో చర్చనీయంగా మారింది. చంద్రబాబు ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రసంగించడానికి వెళ్లడంతో రాలేకపోయారని సరిపెట్టుకున్నా... ఆయన తరువాత పార్టీలో నంబర్ 2గా ఉన్న ఆయన తనయుడు లోకేశ్ రాకపోవడం పార్టీలో చర్చకు కారణమవుతోంది. కిడారి అంత్యక్రియలకు మంత్రులు, పార్టీ నేతలు హాజరైనప్పటికీ లోకేశ్ రాకపోవడం చర్చనీయమైంది. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్తకు కష్టమొచ్చినా అండగా ఉంటానని చెప్పే లోకేశ్ ఇప్పుడు ఏకంగా ఒక గిరిజన ఎమ్మెల్యే - ప్రభుత్వ విప్ మావోయిస్టుల దాడితో మరణిస్తే కనీసం అటు కన్నెత్తి కూడా చూడకపోవడమేంటన్న ప్రశ్న వినిపిస్తోంది.

విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్ మైనింగ్ బ్యాక్ గ్రౌండులో ఈ హత్య జరగడం - బాక్సైట్ వ్యవహారాల్లో లోకేశ్ పేరుండడంతో ఆయన ఇటు రావడానికి సాహసించలేదని తెలుస్తోంది. కిడారి అధికార పార్టీలోకి చేరడానికి భారీ మొత్తాన్ని తీసుకొన్నాడనే ఆరోపణలు కూడా మావోలు ఆయనను హత్య చేయడానికి ఒక రీజన్ అని.. అధికార పార్టీ ముఖ్యులకు బినామీగా భారీ ఎత్తున క్వారీలను నడుపుతున్నాడనే ఆరోపణల నేపథ్యంలోనే మావోలు కిడారిని హత్య చేశారనే మాట వినిపిస్తూ ఉంది.

మావోయిస్టులు తననూ టార్గెట్ చేసి ఉంటారని లోకేశ్ భావిస్తున్నారని... పోలీసులు కూడా లోకేశ్‌ ను ఆ ప్రాంతానికి వెళ్లొద్దని సూచించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ ఎమ్మెల్యే ప్రాణాలు పోయినా చినబాబు కిమ్మనకుండా కూర్చున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.