Begin typing your search above and press return to search.

అప్పులు అందుకే చేశాం.. బుగ్గన ఏం చెప్పారంటే?

By:  Tupaki Desk   |   5 March 2021 4:30 PM GMT
అప్పులు అందుకే చేశాం.. బుగ్గన ఏం చెప్పారంటే?
X
ఏపీ అప్పులు అంతకంతకూ పెరుగుతున్నట్లుగా వస్తున్న గణాంకాలు ఇప్పుడు చర్చగా మారింది. ఏపీపై పెరిగిన అప్పుల భారంపై విపక్షం ఆందోళన వ్యక్తం చేయటమే కాదు.. జగన్ సర్కారు తీరును తీవ్రంగా తప్పు పడుతోంది. దీనిపై తాజాగా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. కోవిడ్ కారణంగా చాలా దేశాల్లో ఆర్థిక వ్యవస్థ తలకిందులైనట్లుగా పేర్కొన్నారు. ప్రతిపక్షం చెప్పినట్లుగా ఏపీ అప్పుల పాలు కాలేదన్నారు.

తాము చేసిన అప్పులన్ని సంక్షేమ పథకాల్ని అమలు చేయటానికేనని చెప్పిన ఆయన.. కోవిడ్ కారణంగా చాలా దేశాల్లో ఆర్థిక వ్యవస్థ తలకిందులైన విషయాన్ని గుర్తు చేశారు. బడ్జెట్ అంచనాల కంటే కూడా ఎక్కువగా అప్పులు చేయాల్సిన పరిస్థితి కోవిడ్ కారణంగా జరిగిందన్నారు. గత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసిందని విమర్శించిన బుగ్గన.. గత ప్రభుత్వం ప్రాధాన్యత లేని ఖర్చులు చేసినట్లు చెప్పారు.

2014నాటికే ఏపీ రెవెన్యూ లోటుతో ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. కోవిడ్ కారణంగా రాబడి తగ్గిందని.. అదే సమయంలో ఖర్చులు విపరీతంగా పెరిగాయన్నారు. మాయాదారి మహమ్మారి కోసం వందల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వానికి ఆదాయం భారీగా తగ్గినా.. ప్రజలకు అందించే సంక్షేమ పథకాల్ని మాత్రం ఆపలేదన్నారు. ఆదాయం లేకున్నా..ప్రజలకు సహాయంగా ఉండాలని సీఎం జగన్ చెప్పారని.. అందుకు తగ్గట్లే ఖర్చు చేసినట్లు చెప్పారు.

2019-20 జూన్ లో రెవెన్యూ రాబడితో పోలిస్తే 2020-21 జూన్ లో రెవెన్యూ రాబడి బాగా పెరిగిందన్నారు. 2020-21 తొలి క్వార్టర్ లో ద్రవ్యలోటు మైనస్ 12.9 శాతం ఉండగా.. మూడో క్వార్టర్ నాటికి మైనస్ 5.5 శాతానికి.. చివరి క్వార్టర్ కు మైనస్ మూడు శాతానికి తగ్గినట్లు చెప్పారు. జూన్ నుంచి డిసెంబరు నాటికి జీఎస్టీ పన్నుల రాబడిలో దేశంలో రెండో స్థానంలో ఉన్నట్లు చెప్పారు. అప్పులు చేస్తున్న విషయాన్ని ఒప్పుకుంటూనే.. ఎందుకు చేయాల్సి వస్తుందన్న విషయాన్ని వివరంగా చెప్పిన బుగ్గన మాటలకు విపక్షాలు ఎలా స్పందిస్తాయో?