Begin typing your search above and press return to search.

న‌వ‌ర‌త్నాల‌పై నివేదిక‌.. జ‌గ‌న్ కూడా షాక‌య్యేలా!!

By:  Tupaki Desk   |   14 July 2022 4:30 PM GMT
న‌వ‌ర‌త్నాల‌పై నివేదిక‌.. జ‌గ‌న్ కూడా షాక‌య్యేలా!!
X
కొన్నికొన్ని విష‌యాలు ఆశ్చ‌ర్యంగా ఉంటాయి. ఏకంగా.. ఇప్పుడు వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రిచే.. షాక్ కు గురిచేసే నివేదిక ఒక‌టి వెలుగు చూసింది. అది కూడా నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఏపీ స‌ర్కారు అప్పులు చేస్తోంద‌ని.. చెబుతూ వ‌చ్చిన నీతి ఆయోగ్ ఇవ్వ‌డం.. జ‌గ‌న్ పాల‌న‌ను ఆకాశానికి ఎత్తేయ‌డం.. వంటివి చూస్తే.. 'ఏదో జ‌రిగింద‌నే' చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

విష‌యం ఏంటంటే.. నవరత్నాలతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు(ఎస్‌డీజీ) సాధనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. అట్టడుగు స్థాయి నుంచి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు నవరత్నాలను ఏకీకరణ చేసి అమలు చేస్తోందని నీతి ఆయోగ్‌ పేర్కొంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నద ని, ఇందులో భాగంగా లక్ష్యాల సాధనపై స్వయంగా ముఖ్యమంత్రి దృష్టి పెట్టార‌ని కితాబిచ్చింది.

వివిధ రాష్ట్రాల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన, స్థానికీకరణ చర్యలపై నీతి ఆయోగ్‌ అధ్యయన నివేదికను విడుదల చేసింది. నవరత్నాల ద్వారా పేదల సామాజిక, ఆర్థికాభివృద్ధికి చర్యలు తీసుకోవడంతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని నివేదికలో పేర్కొంది.

నవరత్నాలతో మానవాభివృద్ధి సూచికలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా గుమ్మం వద్దే పౌర సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని నీతి ఆయోగ్‌ నివేదిక పేర్కొంది.

గ్రామ, వార్డు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేలా కార్యాచరణ రూపొందించి ప్రభుత్వం అమలు చేస్తున్నదని నివేదిక స్పష్టం చేసింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై క్షేత్రస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు అవగాహన కల్పించేందుకు వర్క్‌షాపులు నిర్వహించడంతో పాటు రాష్ట్ర స్థాయిలో లక్ష్యాల సాధన పురోగతిపై రియల్‌టైమ్‌ పర్యవేక్షణకు ప్రత్యేకంగా పోర్టల్‌ను ఏర్పాటు చేసినట్లు నివేదిక తెలిపింది.

28 విభాగాలకు చెందిన సేవలను ఒకే పోర్టల్‌ ద్వారా గ్రామ, వార్డు స్థాయిలో అందించడంతో పాటు ప్రజల ఫిర్యాదులను గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలోనే పరిష్కరిస్తున్నట్లు నివేదిక తెలిపింది. ఎస్‌డీజీల పురోగతిని ప్రణాళికా శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ శాఖలు, శాఖాధిపతులు, సచివాలయ, కలెక్టర్ల స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. మొత్తంగా చూస్తే.. ఈ నివేదిక‌.. వైసీపీ నేత‌ల‌నేకాదు.. ముఖ్య‌మంత్రినే షాక్ చేసింద‌ని.. నేత‌ల మ‌ధ్య గుస‌గుస వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీనివెనుక త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌బోయే.. ఒక 'కీల‌క ఎన్నిక‌' ఉన్న‌ట్టుగా భావించాల్సి వ‌స్తోంద‌ని అంటున్నారు.