Begin typing your search above and press return to search.

ప్రధాని కారుపై కేంద్ర ప్రభుత్వ వర్గాల వివరణ.. మార్పు అందుకేనట

By:  Tupaki Desk   |   30 Dec 2021 11:30 AM GMT
ప్రధాని కారుపై కేంద్ర ప్రభుత్వ వర్గాల వివరణ.. మార్పు అందుకేనట
X
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్ లో ఖరీదైన కారు వ్యవహారంపై స్పందనలు కొనసాగుతూనే ఉన్నాయి. మేకిన్ ఇండియా.. మేడిన్ ఇండియా అంటూ విదేశీ తయారీ రూ.కోట్ల విలువైన కారు వినియోగంపై విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కొత్త కారుపై కీలక వివరాలు వెల్లడించింది. మోదీ వాహన శ్రేణిలోని రేంజ్‌ రోవర్‌ నుంచి మెర్సిడెజ్‌ మేబ్యాచ్ కు మారడంపై కేంద్ర వివరణ ఇచ్చాయి.

కారు ఖరీదు రూ.12 కోట్లు అంటూ విమర్శలు చేస్తున్నారని..అందుకే స్పష్టత ఇస్తున్నట్టు వెల్లడించాయి. ఈ కారును ప్రధాని ఎంచుకోలేదని.. అది అప్‌గ్రేడ్ కాదని, రొటీన్‌ రీ ప్లేస్‌మెంటేనని స్పష్టత ఇచ్చింది కేంద్రం. గ‌తంలో వాడిన బీఎండబ్ల్యూ మోడల్‌ను ఆ సంస్థ త‌యారు చేయ‌డం లేద‌ని, అందుకే కొత్త కార్లను తీసుకున్నట్లు కేంద్ర సర్కారు వర్గాలు వెల్లడించాయి. ప్రధాని భద్రత స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ చూసుకుంటుందని.. ఎవరికైతే రక్షణ కల్పిస్తున్నారో వారి అభిప్రాయం తీసుకోకుండానే భద్రతా కారణాలతో ఎస్పీజీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పాయి.

ధర 3 కోట్లేనా?
ధ‌ర‌పై వ‌స్తున్న ఊహాగానాల‌కు కూడా తెర‌దించే ప్రయ‌త్నం చేశాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. మెర్సిడెజ్‌ మేబ్యాచ్ ధర 12కోట్లు కాదని..అందులో మూడో వంతు ఉంటుంద‌ని తెలిపాయి. అంటే రూ.3 కోట్లకు అటుఇటుగా ఉంటుందని భావించాల్సి ఉంటుందని తెలుస్తోంది.కాగా, ప్రధానికి ర‌క్షణ క‌ల్పిస్తోన్న స్పెష‌ల్ ప్రొటెక్షన్ గ్రూప్.. ఆరేళ్లకోసారి కాన్వాయ్ వాహ‌నాల‌ను మార్చేస్తుంది. కానీ ప్రధాని మోదీ త‌న పాత కార్లను ఎనిమిదేళ్ల వ‌ర‌కు వినియోగించారని తెలిపారు.

ప్రధాని సెక్యూరిటీకి సంబంధించిన ఆడిట్‌ సమయంలో.. ఈ అంశం ప్రస్తావ‌న‌కు రావ‌డంతో ఆందోళ‌న వ్యక్తమైంది. అందుకే భ‌ద్రత‌ను పెంచాల‌ని భావించినట్లు వెల్లడించాయి. పొంచి ఉన్న ముప్పు ఆధారంగా ప్రధాని కోసం ఎస్పీజీ వాహ‌నాల‌ను తీసుకుంటుంద‌ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. కాన్వాయ్‌లో చేరిన కొత్త కారును ఎలాంటి పేలుళ్లనైనా తట్టుకునేలా డిజైన్‌ చేశారు. అలాగే టైర్లు పంక్చరైనా దూసుకెళ్లే రీతిలో ఫ్లాట్‌ టైర్లను ఫిక్స్‌ చేశారు.

ప్రత్యేకతలు.. విశిష్టతలివి మెర్సిడెజ్‌ మేబ్యాచ్ లో 6 లీట‌ర్ల ట్విన్ ట‌ర్బో వీ12 ఇంజిన్‌ను వాడుతున్నట్లు పేర్కొన్నారు. టాప్ స్పీడ్‌ 160 కిలోమీట‌ర్లు. కారు బాడీ, విండోస్.. బుల్లెట్లు, పేలుళ్లను తట్టుకోగల గట్టి ఉక్కు కోర్‌తో డిజైన్ చేశారు. 2 మీటర్ల దూరంలో 15కేజీల టీఎన్టీ బ్లాస్ట్ జరిగినా.. కారులో ఉన్నవారికి ఏమీ కాదు. అంతే కాదు. దీని బాడీ డైరెక్ట్ ఎక్స్ ప్లోజన్ నుంచి కూడా రక్షిస్తుంది. క్యాబిన్లో ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్లు ఉంటాయి. గ్యాస్ అటాక్ జరిగితే కారులో సపరేట్ ఎయిర్ సప్లై కూడా ఏర్పాటు చేశారు.

ఈ కారు 6.0- లీటర్ ట్విన్-టర్బో V12 ఇంజన్‌తో వస్తుంది. ఇది 516 BHP పవర్ 900 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మెర్సిడెజ్‌ మేబ్యాక్ S650 గార్డ్ ఫ్యుయల్ ట్యాంక్ ఒక ప్రత్యేక కోటింగ్తో వస్తుంది. బోయింగ్ ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్లలో ఉపయోగించే కోటింగ్ను ఉపయోగించారు.

స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ . దేశాధినేతల భద్రతను చూసుకుంటుంది. వారి సెక్యూరిటీ రీజన్స్‌ను పరిగణనలోకి తీసుకొని దేశాధినేతకు వాహనాన్ని అప్‌గ్రేడ్ చేయాలా వద్దా అనేది ఎస్పీజీ నిర్ణయిస్తుందని అధికారవర్గాలు వెల్లడించాయి.