Begin typing your search above and press return to search.

లోకేశ్ నామినేషన్.. ఆయనకు షాకిచ్చింది

By:  Tupaki Desk   |   7 March 2017 5:13 AM GMT
లోకేశ్  నామినేషన్.. ఆయనకు షాకిచ్చింది
X
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిన చందంగా మారింది ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు పుత్రరత్నం లోకేశ్ ఎమ్మెల్సీ నామినేషన్ వ్యవహారం. తొలిసారి చట్టసభలోకి అడుగుపెట్టే కార్యక్రమం విషయంలో చోటు చేసుకున్న పొరపాట్లు కీలక అధికారికి షాకివ్వటమే కాదు.. ఎన్నికల సంఘానికి సమాధానం చెప్పుకునే పరిస్థితిని కల్పించింది. అంతేకాదు.. పలు విమర్శల్ని ఎదుర్కొనేలా చేసింది.

బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న వేళ.. పోట్రోకాల్ ను బ్రేక్ చేసేలా అసెంబ్లీ ఇన్ ఛార్జ్ కార్యదర్శి సత్యనారాయణ బయటకు వెళ్లటం వివాదంగా మారింది. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసే సీఎం కుమారుడి కోసమే ఆయన బయటకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. దీనిపై పలువురు విమర్శలు సంధిస్తున్నారు. అసెంబ్లీ ఇన్ చార్జ్ కార్యదర్శి తీరు గవర్నర్ ను అవమానించేలా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు..లోకేశ్ నామినేషన్ పత్రాల్ని అసెంబ్లీ ఇన్ ఛార్జ్ కార్యదర్శి కార్యాలయంలో పూజలు జరిపించటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఆయన ఛాంబర్లో నామినేషన్ పత్రాల్ని పూజలు జరిపించటం.. పలువురు నేతలు అక్కడే ఉండటంతో.. గవర్నర్ ప్రసంగం సాగుతున్న వేళ. అసెంబ్లీలో ఉండాల్సిన అసెంబ్లీ ఇన్ ఛార్జ్ కార్యదర్శి తన ఛాంబర్లో ఉన్నారు.

ఈ ఉదంతంపై ఎన్నికల అధికారి భన్వర్ లాల్ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అయితే.. తన ఛాంబర్లో తానుపూజలు చేస్తున్న వేళ.. లోకేశ్ తదితరులు తనకార్యాలయానికి వచ్చినట్లుగా సత్యానారాయణ చెబుతున్నారు. ఒకవేళ.. అదేనిజమనుకుంటే.. గవర్నర్ ప్రసంగించే సమయంలో.. అసెంబ్లీ ఇన్ చార్జ్ కార్యదర్శి తనకార్యాలయంలో పూజలు చేసుకోవటం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. ఒక తప్పును కవర్ చేసుకోవటానికి మరోతప్పు అన్న చందంగా.. చినబాబును కవర్ చేసుకోవటానికి అసెంబ్లీ ఇన్ ఛార్జ్ కార్యదర్శి సత్యనారాయణ కిందామీదా పడాల్సి వస్తోందన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/