Begin typing your search above and press return to search.

ఢిల్లీ నుంచి నరుక్కొచ్చిన రేవంత్.. కాంగ్రెస్ లో అసమ్మతి నేతలకు చెక్..

By:  Tupaki Desk   |   28 March 2022 7:41 AM GMT
ఢిల్లీ నుంచి నరుక్కొచ్చిన రేవంత్.. కాంగ్రెస్ లో అసమ్మతి నేతలకు చెక్..
X
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొరఢా ఝలిపించాడు. తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి రాజేస్తున్న నేతలకు చెక్ పెట్టారు. ఢిల్లీ కేంద్రంగా రేవంత్ రెడ్డి చేసిన బౌలింగ్ కు ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు ఔట్ అయిపోయారు. తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి చెక్ పెట్టేశారు. వారి వాయిస్ పెరగకుండా కంట్రోల్ చేశారు.

కొద్దిరోజులుగా హైదరాబాద్ కేంద్రంగా రేవంత్ రెడ్డిపై సొంత పార్టీలోని వ్యతిరేకులు స్వరం పెంచారు. వరుసగా సమావేశాలు, అల్టిమేటం జారీ చేస్తున్నారు. కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లాంటి నేతలు పార్టీ హైకమాండ్ కు తాము విధేయులమని చెబుతూనే.. రేవంత్ తో ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిస్తున్నారు. ఇక ఇప్పుడు రేవంత్ -అసమ్మతి నేతల ఫైట్ ఢిల్లీకి చేరింది.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేయడానికి రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు వివరించడానికి తమ కార్యాచరణను ముమ్మరం చేశారు. రేవంత్ పైన ఫిర్యాదు చేయడానికి.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు వివరించడానికి కాంగ్రెస్ అసమ్మతి నేతలు ఢిల్లీకి చేరారు. వారికి ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, అగ్ర నేత రాహుల్ గాంధీ యే కాదు.. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ కూడా అపాయింట్ మెంట్ ఇవ్వడానికి నిరాకరించారు.

ఇక రేవంత్ కు వ్యతిరేకంగా మరో ఇద్దరు ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు కూడా ఈ అసమ్మతి నేతలకు దక్కలేదు. వారిద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక అసమ్మతిపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంగా ఉంది. వారిపై కఠినంగా వ్యవహారించాలనే అభిప్రాయంతో ఉంది. ఎక్కడా ఎవరిని ప్రోత్సహించకూడదని నిర్ణయించింది.

దీన్ని కాంగ్రెస్ ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రహించడంతో వారు ప్రస్తుతం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. తాజాగా కోమటిరెడ్డి పార్లమెంట్ ఆవరణలో సోనియాను కలువడానికి ప్రయత్నించినా ఆమె ఆసక్తి చూపలేదని తెలిసింది.

ఇక రేవంత్ కు వ్యతిరేకంగా అధినేత్రి సోనియా గాంధీకి కాంగ్రెస్ అసమ్మతి నేతలు వరుసగా లేఖలు రాస్తున్నారు. వీటిని పార్టీ ప్రధాన కార్యదర్శికి సోనియా పంపిస్తోంది. ఆయన వాటిపై రేవంత్ తో చర్చిస్తున్నారు. దీంతో తెలంగాణలో అసమ్మతి నేతల కుట్రలన్నీ రేవంత్ కు ముందే తెలుస్తున్నాయి.

ఏఐసీసీ పెద్దలు, కాంగ్రెస్ అధిష్టానంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగానే అసమ్మతి నేతలకు చెక్ పెడుతున్నారు. హైకమాండ్ మద్దతు తనకే ఉందని.. బలమైన సంకేతాలు పంపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సమయం కోసం ఎదురుచూడడం తప్ప అసమ్మతి నేతలకు మరో ఆప్షన్ లేకుండా పోయింది.