Begin typing your search above and press return to search.

ఇలాంటివన్నీ రేవంత్ కు మాత్రమే సాధ్యం భయ్

By:  Tupaki Desk   |   26 Nov 2020 3:00 PM GMT
ఇలాంటివన్నీ రేవంత్ కు మాత్రమే సాధ్యం భయ్
X
మాటలు నేర్చిన నేత ఏమైనా మాట్లాడగలరని ఊరికే అనలేదు మరి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మాటల్ని చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. గ్రేటర్ ఎన్నికల ఆటలో తమ పాత్ర ఏమీ లేకున్నా.. ఏదోలా తాము వార్తల్లోకి రావాలని కాంగ్రెస్ నేతలు తెగ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఎంత ప్రయత్నిస్తున్నా.. ఇప్పటివరకు సరైన అవకాశం దక్కని వారికి.. తాజాగా బండి సంజయ్ వర్సెస్ అక్బరుద్దీన్ మధ్య సాగిన మాటల యుద్ధంలోకి చటుక్కున దూరిపోయారు రేవంత్ రెడ్డి.

పాతబస్తీలో అక్రమంగా నివసిస్తున్న వారిపై సర్జికల్ స్ట్రైక్స్ అంటూ బండి సంజయ్ విరుచుకుపడితే.. దానికి కౌంటర్ గా మజ్లిస్ అధినేత సోదరుడు అక్బరుద్దీన్ మరింత ఘాటుగా స్పందిస్తూ.. హుస్సేన్ సాగర్ పరిధిలో ఉన్న పీవీ ఘాట్.. ఎన్టీఆర్ ఘాట్ ను కూల్చేయాలంటూ కొత్త చర్చను తీసుకొచ్చారు. దీంతో.. ఇప్పటివరకు ఎన్నికల్లో తమ ఉనికి కోసం తెగ ప్రయత్నిస్తున్న టీడీపీ.. కాంగ్రెస్ నేతలకు అవకాశం లభించింది. ఎన్టీఆర్.. పీవీ మీద అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వారి ఘాట్ల వద్దకు వెళ్లి నివాళులు అర్పించి వచ్చారు బండి సంజయ్.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు రేవంత్. ఎన్టీఆర్.. పీవీ లాంటి మహానేతల పేర్లను బీజేపీ.. మజ్లిస్ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం దర్మార్గమన్నారు. సొంత పార్టీ నేతలైన అద్వానీ.. మురళీమనోహర్ జోషీ.. కల్యాణ్ సింగ్ లాంటి వారిని గౌరవించుకోలేని పార్టీ.. ఎన్టీఆర్.. పీవీలపై ప్రేమ ఒలకబోస్తోందని ఫైర్ అయ్యారు. నిజంగానే ఎన్టీఆర్.. పీవీల మీద ప్రేమ ఉంటే.. వారికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఈ నెల29న నగరానికి వస్తున్న అమిత్ షా.. మహానేతల ఘాట్లను సందర్శించి.. అక్కడే ప్రకటన చేయాలన్న ఆయన.. మరో ఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు. ఈ మాటల్ని వింటే.. ఇలాంటివి రేవంత్ మాత్రమే చెప్పగలరన్న భావన కలగటం ఖాయం. ఇంతకూ ఆ విషయం ఏమంటే.. ప్రతి రోజు రాత్రి బండి సంజయ్.. అరవింద్ లు.. మజ్లిస్ నేతలు అసదుద్దీన్..అక్బరుద్దీన్ ఓవైసీలతో మాట్లాడుతుంటారన్నారు.

వారి మధ్య నిత్యం ఫోన్ కాన్ఫరెన్సు నడుస్తుంటుందని.. వారి మధ్య కోఆర్డినేషన్ అమిత్ షా చేస్తుంటారన్నారు. రాత్రి అంతా కలిసి స్క్రిప్ట్ వర్క్ తయారు చేసుకుంటారని.. ఉదయం సురభి నాటానికి తెర లేపుతారన్న ఆయన.. రోజూ ఇదే జరుగుతుందన్నారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత ఎన్టీఆర్.. పీవీ పేర్లను బీజేపీ కనీసం ప్రస్తావించరన్నారు. ఇలాంటి భావోద్వేగాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.