Begin typing your search above and press return to search.

ఓటుకు నోటు కేసు: రేవంత్‌ రెడ్డికి తాత్కాలిక ఉపశమనం!

By:  Tupaki Desk   |   25 Aug 2021 11:32 AM GMT
ఓటుకు నోటు కేసు: రేవంత్‌ రెడ్డికి తాత్కాలిక ఉపశమనం!
X
ఓటుకు నోటు కేసులో టి.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఉపశమనం లభించేలా కనిపిస్తోంది. మే 2015లో నమోదైన ఈ సంచలన ‘ఓటుకు నోటు’ కేసులో రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డంగా బుక్ చేసింది. నాడు టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి వీడియో సాక్షిగా దొరికిపోయాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

ఈ కేసులో రేవంత్‌తో పాటు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై కూడా తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. రేవంత్ - సండ్ర ఇద్దరూ తరువాత టీడీపీని వీడారు. రేవంత్ కాంగ్రెస్‌లో చేరి టీపీసీసీ చీఫ్‌గా మారగా, 2019 డిసెంబర్‌లో టీడీపీ నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సండ్ర 2019లో టీఆర్ఎస్‌లోకి ఫిరాయించారు. సండ్ర ఇప్పుడు తన పేరును నిందితుల జాబితాలోంచి తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదని వాదిస్తూ, ఈ కేసు కేంద్ర ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 కిందకు వస్తుందని వాదించారు. రేవంత్ రెడ్డి ఇంతకు ముందు దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు పెండింగ్‌లో ఉంది. ఈ అంశంపై ఆగస్టు 30 లోగా కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు బుధవారం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ కేసు నుండి సండ్ర పేరును తొలగించడానికి టీఎస్ ప్రభుత్వం అంగీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తే, రేవంత్ రెడ్డి పేరును కూడా తొలగించాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే సండ్ర ఇప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నందున, ఈ కేసులో ఏమి చేయాలనే దానిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెనకడుగు వేస్తారా? ఆయనపై కేసును ఉపసంహరించుకుంటారా? అన్నది ఆసక్తిగా మారింది. అదే జరిగితే రేవంత్ రెడ్డి నెత్తిన కూడా పాలుపోసినట్టు అవుతుంది. సుప్రీంకోర్టు కేసును సెప్టెంబర్ 7కి వాయిదా వేసింది. అంతకు ముందు కేసీఆర్ సండ్ర పేరును తొలగించాలా వద్దా అనే దానిపై తేల్చిచెబుతాడు కాబట్టి ఈ కేసులో రేవంత్‌ కు ఉపశమనం కలిగేలానే ఉంది.