Begin typing your search above and press return to search.

శంకుస్థాపన హీరోలు.. జీరోలు

By:  Tupaki Desk   |   23 Oct 2015 4:18 AM GMT
శంకుస్థాపన హీరోలు.. జీరోలు
X
అంగరంగ వైభవంగా.. ఆరంభం అదిరిపోయేలా అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంతోమంది ఎన్నో విధాలుగా కృషి చేశారు. వారి కష్టం ఫలించి ఈ కార్యక్రమం తెలుగు వారి మదిలోనే కాదు.. దేశ వ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షించింది.

ఇంతటి భారీ కార్యక్రమాన్ని నిర్వహించగలిగిన సత్తా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే ఉందన్న మాట వినిపించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అమరావతి శంకుస్థాపన విషయంలో చంద్రబాబు ఎన్ని పొగడ్తలు పొందుతున్నారో.. అంతే స్థాయిలో తెగడ్తలకూ అవకాశం కలగటం.

అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ముగిసిన పిమ్మట.. అతి కీలకమైన స్థానాల్లో ఉన్న వారి పట్ల ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాల్ని మదింపు చేసి.. హీరోలుగా జీరోలుగా పట్టిక తయారు చేస్తే ఇలా ఉండదనుంది. కేవలం హీరోలు.. జీరోలు అన్న మాటను తేల్చేయకుండా.. దానికి కారణాలు ఏమిటన్న అంశంపై పెద్ద ఎత్తున అభిప్రాయం సేకరించినప్పుడు వారి మనోభావాలు ఇలా ఉండనున్నాయి.

హీరోలు

రాజధాని రైతులు; అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ఇంత అద్భుతంగా జరిగిందంటే దానికి కారణం ఏపీ రైతులు. అమరావతి ప్రజా రాజధాని అన్న చంద్రబాబు మాటను నమ్మి దాదాపు 33వేల ఎకరాలు ఇవ్వటమే కాదు.. రైతుల నుంచి బలవంతంగా ఏపీ సర్కారు భూమి లాక్కుంటుందన్న ఆరోపణ చేసిన విపక్షాల మాటల్లో అర్థం లేదని.. శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా వారి కేరింతలు నిజమేంటో చెప్పకనే చెప్పేశాయి.

చంద్రబాబు నాయుడు; ఇంత భారీ కార్యక్రమాన్ని ఎలాంటి లోపం లేకుండా నిర్వహించటం. వైరాన్ని వదిలేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించటంలో ప్రదర్శించిన రాజకీయ పరిణితి.

కేసీఆర్ ; తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అమరావతి వచ్చినప్పటికీ.. ఆంధ్రుల్ని తన మాటలతో అలరించారు. విడిపోయి కలిసి ఉండటం ఏమిటో చేతల్లో చూపించటమే కాదు.. కోరకుండానే వరమిచ్చేసి సీమాంధ్రుల్ని సంతోషపెట్టేశారు.

ఏపీ సర్కారు; అరకొర వసతులు.. నిధుల లేమి ఇబ్బంది పెడుతున్నా అదేమీ పట్టించుకోకుండా అమరావతి శంకుస్థాపనను అద్భుతంగా నిర్వహించాలన్న పట్టుదలతో చేసిన కృషి స్పష్టంగా కనిపించింది.

ఏపీ పోలీసులు; పెద్ద పెద్ద కార్యక్రమాల సందర్భంగా పోలీసుల భద్రతా వైఫల్యం కనిపిస్తూ ఉంటుంది. సమన్వయ లోపం కారణంగా ట్రాఫిక్ జాం లాంటివి చోటు చేసుకుంటాయి. కానీ.. అలాంటిదేమీ చోటు చేసుకుండా వ్యవహరించటంలో ఏపీ పోలీసు సమర్థంగా వ్యవహరించింది. హోం గార్డు మొదలు డీజీపీ వరకూ కమిట్ మెంట్ తో పని చేశారు.

ఎం. నారాయణ నాయక్ ; గుంటూరు గ్రామీణ ఎస్పీ ముందుచూపు.. పక్కా ప్రణాళికతో ట్రాఫిక్ కష్టాలు అమరావతి శంకుస్థాపనకు కలగకుండా చేశాయి.

కేశినేని నాని ; ఏర్పాట్లకు సంబంధించి అందరి దృష్టిని ఆకర్షించింది వాహనాలే. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున వాహనాలు తీసుకురావటమే కాదు.. ఖరీదైన.. విలాసవంతమైన కార్లను ఎంపిక చేయటంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యాపార అనుభవం బాగా కలిసి వచ్చింది.

సాయికుమార్.. సునీతలు; శంకుస్థాపన మహోత్సవానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ప్రముఖ సినీ నటులు సాయికుమార్.. గాయని సునీతలు తమ గాత్రంతో అతిధుల్ని.. ఆంధ్రప్రజల్ని అలరించారు. మరి.. ముఖ్యంగా సునీత ఆలపించిన ‘‘మా తెలుగు తల్లికి మల్లెపూ దండ’’ గీతం భావోద్వేగానికి గురి చేసింది.

శివమణి ; తన మ్యూజిక్ మేజిక్ తో శంకుస్థాపన కార్యక్రమానికి కొత్త కళ తీసుకొచ్చారు.

కళాకారులు ; శంకుస్థాపన కార్యక్రమంలో కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. గంటల కొద్దీ సమయాన్ని బోర్ కొట్టకుండా చేయటంలో వారెంతో శ్రమించారు.

అంబికా క్యాటర్స్ ; దాదాపుగా 1.5లక్షల మందికి భోజనం ఏర్పాటు చేయటం.. వీవీఐపీలు భేష్ అనేలా వంటలు చేయటం అంత చిన్న విషయం కాదు. కానీ.. ఈ భారీ క్రతువును ఎలాంటి తడబాటు లేకుండా పక్కాగా పూర్తి చేసి పలువురి మన్ననలు పొందారు. మహానాడులో తమ సత్తా చాటిన అంబికా క్యాటర్స్.. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో మరోసారి తామేంటో నిరూపించుకున్నారు.

జీరోలు

మోడీ ; ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఎంతో ఆశగా ఎదురు చూసిన వరాల విషయంలో మోడీ తీవ్రంగా నిరాశపర్చారు. పార్లమెంటు పుట్టమన్ను.. యమునా నీటిని మాత్రమే ఇచ్చిన ఆయన తీరుపై సర్వత్రా అగ్రహం వ్యక్తమవుతోంది.

చంద్రబాబునాయుడు ; శంకుస్థాపన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినప్పటికీ ప్రధాని మోడీ చేత వరాలు ఇప్పించే విషయంలో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు.

వెంకయ్యనాయుడు ; ఢిల్లీ స్థాయిలో తనకు మించిన మొనగాడు లేడని చెప్పుకునే ఆయన శంకుస్థాపన సందర్భంగా కనీసం ఒక్క వరాన్ని కూడా ఇప్పించలేకపోయారు.

వైఎస్ జగన్ ; విపక్ష నేతగా అమరావతి శంకుస్థాపనకు హాజరుకావాల్సి ఉన్నా.. రాజకీయ పరిణితి ప్రదర్శించటంలో విఫలమై.. ఆహ్వానం ఇచ్చేందుకు తన ఇంటికి రావొద్దంటూ నవ్వుల పాలయ్యారు.

ఏపీ విపక్షాలు ; పసలేని కారణాలు చూపించి శంకుస్థాపన కార్యక్రమానికి డుమ్మా కొట్టేసి.. రాజకీయమే తప్పించి ప్రజల భావోద్వేగాలు తమకు సంబంధం లేవని తేల్చి చెప్పారు.

ఏపీ బీజేపీ నేతలు ; సీమాంధ్రలో తమ బలాన్ని పెంచుకోవాలని కలలు కనే నేతలు.. అధినాయకత్వానికి ప్రజల అంచనాల్ని వివరించి.. ఆ దిశగా వారి చేత వరాలు ఇప్పించటంలో పూర్తిస్థాయిలో విఫలమయ్యారు.