Begin typing your search above and press return to search.

వేట కొడవళ్లతో ఎస్ఐ పై దాడి ... సీఎం దిగ్బ్రాంతి !

By:  Tupaki Desk   |   22 Nov 2021 9:33 AM GMT
వేట కొడవళ్లతో ఎస్ఐ పై దాడి ...  సీఎం దిగ్బ్రాంతి !
X
తమిళనాడు లోని తిరుచ్చిలో మేకల దొంగలు వీరంగం సృష్టించారు. తమను పట్టుకునేందుకు వచ్చిన స్పెషల్‌ ఎస్‌ ఐ ను దారుణంగా హతమార్చారు. మేకల దొంగలు వేట కొడవలితో ఎస్ ఐ ను హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన అనంతరం దుండగుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. తిరుచ్చి జిల్లా నవల్‌పట్టుకు చెందిన స్పెషల్ ఎస్సై భూమినాథన్‌ శనివారం రాత్రి పుదుక్కోట్టై జిల్లా కీరనూర్‌ సమీపంలోని కలమావూర్‌ వద్ద గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారు జామున బైకుపై మేకతో వెళుతున్న ఇద్దరిని అడ్డుకునేందుకు ఆయన ప్రయత్నించారు.

దీనితో దుండగులు అక్కడి నుంచి పరారవ్వడంతో భూమినాథన్‌, మరో పోలీస్‌ చిత్తిరైవేల్‌ వేర్వేరుగా ద్వచక్రవాహనాలపై వారిని వెంబడించారు. ఈ క్రమంలో మేకల దొంగలు కీరనూర్‌ ప్రాంతంలో భూమినాథన్‌ ను బంధించి పోలీసులకు సమాచారం అందించారు.

అయితే పోలీసులు వచ్చే లోపే దొంగలు భూమినాథన్‌ ను కొడవలితో నరికి కిరాతకంగా హత్య చేసి పారిపోయారు. కీరనూర్‌ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుచ్చిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అనంతరం దుండగులను పట్టుకునేందుకు ఎనిమిది పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, ఈ ఘటన పై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. భూమినాథన్‌ కుటుంబానికి రూ.కోటి పరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని సీఎం స్టాలిన్‌ ప్రకటించారు. భూమినాథన్ నవల్‌ పట్టు పోలీస్‌స్టేషన్‌ లో ఎస్‌ ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. విధి నిర్వహణలో నిజాయితీ పరుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఎస్ ఐ మృతిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న పోలీసుల హత్యలను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం రూపొందించాలని ఆయన స్టాలిన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, ఎస్ ఐ అంత్యక్రియలు తిరుచ్చి సోలమానగర్‌ లోని ఆయన స్వగ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.