Begin typing your search above and press return to search.

పోలీస్ స్టేష‌న్‌కు చేరిన నెల్లూరు బాబాయ్ - అబ్బాయ్ పంచాయ‌తీ!

By:  Tupaki Desk   |   25 Aug 2022 6:39 AM GMT
పోలీస్ స్టేష‌న్‌కు చేరిన నెల్లూరు బాబాయ్ - అబ్బాయ్ పంచాయ‌తీ!
X
వైఎస్సార్సీపీ అత్యంత బ‌లంగా ఉన్న జిల్లాల్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఒక‌టి. ఇక్కడ గ‌త ఎన్నిక‌ల్లో ప‌దికి ప‌ది అసెంబ్లీ స్థానాల‌ను, నెల్లూరు పార్లమెంటు స్థానాన్ని వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే సొంత పార్టీలోని నేతల మ‌ధ్య విభేదాలు ఆ పార్టీ అధిష్టానానికి త‌ల‌పోటు తెస్తున్నాయ‌ని అంటున్నారు.

నెల్లూరు సిటీలో మాజీ మంత్రి, తిరుప‌తి, వైఎస్సార్ జిల్లాల వైఎస్సార్సీపీ కోఆర్డినేట‌ర్ అనిల్ కుమార్ యాద‌వ్‌కు, ఆయ‌న బాబాయ్, నెల్లూరు మునిసిప‌ల్ కార్పొరేష‌న్ డిప్యూటీ మేయ‌ర్ రూప్ కుమార్ యాద‌వ్‌కు విభేదాలు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఇటీవ‌ల మునిసిప‌ల్ కార్పొరేష‌న్ స‌మావేశాల్లోనే అనిల్, రూప్ కుమార్ యాద‌వ్ వ‌ర్గాల కార్పొరేట‌ర్లు బాహాబాహీకి దిగారు. మ‌రోవైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో నెల్లూరు సిటీ నుంచి అసెంబ్లీకి తానే పోటీ చేస్తాన‌ని అనిల్ కుమార్ బాబాయి రూప్ కుమార్ యాద‌వ్ చెప్పుకుంటూ తిరుగుతుండ‌టం అనిల్ కు కాక లేపుతోంద‌ని అంటున్నారు. రూప్ కుమార్ కు సొంత పార్టీలోనే కొంత‌మంది ముఖ్య నేత‌లు మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని అనిల్ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు చెప్పుకుంటున్నారు.

మ‌రోవైపు రూప్ కుమార్ యాద‌వ్ కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులోకి ఉండ‌టానికి జ‌గ‌న‌న్న భ‌వ‌న్ కార్యాల‌యానికి శంకుస్థాప‌న చేశారు. దీనికి హాజ‌రైన కొంత‌మంది కార్య‌క‌ర్త‌ల‌ను నెల్లూరు టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అగ్గిమీద గుగ్గిల‌మైన రూప్ కుమార్ యాద‌వ్ పోలీసు స్టేష‌న్ కు వెళ్లి త‌న అనుచరుల‌ను విడిపించుకుని వ‌చ్చారు.


రూప్ కుమార్ యాద‌వ్ కు వ‌ర్గానికి చెందిన వినోద్‌, కార్తీక్, సురేష్‌లను విచారణ నిమిత్తం పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో రూప్‌కుమార్ యాదవ్ పోలీస్ స్టేష‌న్ కు చేరుకుని.. వారిని విడుదల చేయాలని, లేకుంటే ఇక్కడే కూర్చుంటారని ఆందోళన చేప‌ట్టారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్ఐ ర‌మేశ్ బాబు ఉండ‌గానే ఆయ‌న‌ సమక్షంలోనే స్టేషన్‌లో ఉన్న కార్యకర్తలను బ‌ల‌వంతంగా బయటకు తీసుకెళ్లార‌ని చెబుతున్నారు.

ఈ సంద‌ర్భంగా రూప్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ... పార్టీ కార్యాలయం భూమిపూజకు వెళ్లిన వారిపై కావాలనే పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అయిదు నిమిషాల్లో కార్యకర్తలను బయటకు తీసుకొచ్చామని, మీ అధికారం... మీ పరువు.. ఏమైందని రూప్ కుమార్ యాద‌వ్ ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. జగనన్న భవన్‌ శంకుస్థాపన రోజు ట్రైలర్ చూపించాన‌ని, త‌న అనుచ‌రుల‌ జోలికి వస్తే త్రిపుల్‌ఆర్‌ సినిమా చూపిస్తాన‌ని హెచ్చరించారు.

మ‌రోవైపు వీధి దీపాలు వేస్తున్న సిబ్బందిని కొంత‌మంది అడ్డుకున్నారంటూ విద్యుత్తు శాఖ అధికారులు ఫిర్యాదు ఇచ్చార‌ని పోలీసులు తెలిపారు. దీంతో అడ్డుకున్న‌వారిని విచార‌ణ కోసం స్టేష‌న్‌కు పిలిపించామని చెబుతున్నారు. తామెవ‌రినీ అక్ర‌మంగా అరెస్టు చేయ‌లేదంటున్నారు.