Begin typing your search above and press return to search.

రోశయ్య చెప్పిన మాటే నిజమవుతోందిగా..

By:  Tupaki Desk   |   12 Feb 2017 4:58 AM GMT
రోశయ్య చెప్పిన మాటే నిజమవుతోందిగా..
X
తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో.. గవర్నర్ నిర్ణయం ఎలా ఉండబోతోందన్న విషయాన్ని.. తమిళనాడుకు గవర్నర్ గా వ్యవహరించిన తెలుగువ్యక్తి రోశయ్యను మీడియా ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యను చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏం జరుగుతుందన్నది తాను చెప్పలేనని.. ప్రస్తుతం ఇన్ ఛార్జ్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న విద్యాసాగర్ రావు పుస్తకాలు బాగా చదువుతారని.. రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉందని..అలాంటివి వ్యక్తి గవర్నర్ స్థానంలో ఉన్న నేపథ్యంలో.. ఆచితూచి నిర్ణయం తీసుకుంటారని.. విమర్శలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటారన్న మాటను చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. గవర్నర్ నిర్ణయం తీసుకోవటానికి నాలుగైదు రోజులు పడుతుందని.. అప్పటివరకూ ఆయనేం చేయలేరన్నట్లుగా రోశయ్య ఒక అంచనాను వినిపించారు. అటు మీడియాకానీ.. ఇటు రాజకీయ వర్గాలు కానీ.. తమిళనాట ఏదో ఒకటి వెనువెంటనే జరిగిపోతుందన్న వాదనను పలువురు వినిపించారు. అయితే.. ఏదో జరుగుతున్నట్లుగా అనిపించినా.. ఏమీ జరగకుండా ఉండటం.. ఎప్పటికప్పుడు వాయిదాల మీదా వాయిదాలు పడటం కనిపిస్తుంది.

చూస్తుండగానే.. నాలుగురోజుల గడిచిపోయిన పరిస్థితి. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న రోశయ్య లాంటి వారు.. తాజాగా నెలకొన్నపరిణామాలు చివరకు ఎక్కడి వరకూ వెళతాయన్నది అంచనా వేయగలరు. అయితే.. వివాదాలకు కిలోమీటర్ల దూరంలో ఉండే ఆయన.. తన మైండ్ సెట్ కు తగ్గట్లే వివాదాస్పద అంశాల మీద పెదవి విప్పని ఆయన.. వివాదం పరిష్కారమయ్యేది ఎప్పుడున్న అంచనాను వినిపించారు. అందుకు తగ్గట్లే తాజా పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం. రాజకీయంగా రోశయ్యకున్న విశేష అనుభవం ఎంతటిదో తమిళనాడు ఎపిసోడ్ తో ఇట్టే అర్థమవుతుందని చెప్పాలి.