Begin typing your search above and press return to search.

ఆర్ఆర్ఆర్ : 14 మండలాల్లో వేలాది ఎకరాలు.. భూసేకరణ వేగవంతం

By:  Tupaki Desk   |   9 Sep 2022 1:30 PM GMT
ఆర్ఆర్ఆర్ : 14 మండలాల్లో వేలాది ఎకరాలు.. భూసేకరణ వేగవంతం
X
హైదరాబాద్ సిగలో మరో మణిహారంగా మారబోతున్న రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్)కు భూసేకరణ ప్రక్రియ మొదలైంది.. మొదట హైదరాబాద్ ఉత్తర దిశలో ఉమ్మడి మెదక్ జిల్లాలో భూసేకరణ ప్రారంభమైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ రోడ్డు 110 కిలోమీటర్ల పొడవునా విస్తరించే అవకాశమున్నది. దీని కోసం 14 మండలాల్లో 73కు పైగా గ్రామాల్లో వేలాది ఎకరాల్లో భూసేకరణ జరుగనుంది. ఈ క్రమంలోనే సర్వే పనులను ప్రారంభించారు.

ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డుతో ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే వారికి సౌకర్యవంతంగా ఉంది. ఇప్పుడు దానికి చుట్టుపక్కల మరో రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి ప్రక్రియ మొదలైంది.. భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంపీటెంట్ అథారిటీలోని 8మంది అధికారులకు గాను ముగ్గురు అధికారుల పరిధిలోని గ్రామాలకు సంబంధించిన సర్వే మొదలుపెట్టారు.

చౌటుప్పల్ , చిట్యాల నుంచి భువనగిరి, గజ్వేల్ మీదుగా సంగారెడ్డి (కంది) వరకూ 65వ జాతీయ రహదారిని తాకుతూ 164 కి.మీల మేర రహదారి విస్తరించనుంది.

ఈ రీజనల్ రోడ్డు యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ అదే జిల్లా పరిధిలోని చౌటుప్పల్ ఆర్డీవో, సంగారెడ్డి జిల్లా ఆంధోల్-జోగిపేట ఆర్డీవోల పరిధిలోని 31 గ్రామాలకు సంబంధించిన సర్వే చేస్తున్నారు.

సేకరించే భూమిలో 617 హెక్టార్లకు సంబంధించిన సర్వే మొదలైంది. కంపీటెంట్ అథారిటీలో భాగంగా ఉన్న యాదాద్రి-భువనగిరి అదనపు కలెక్టర్ పరిధిలోని గంధమల్ల, వీరారెడ్డి పల్లె, కోనాపూర్, ఇబ్రహీంపూర్, దత్తాయపల్లె, వెలుపుపల్లె, మల్లాపూర్, దత్తార్ పల్లె గ్రామాలకు సంబంధించి 208.6090 హెక్టార్ట భూమిని సమీకరించనున్నారు.

రోడ్డు నిర్మాణం జరిగే 100 మీటర్ల నిడివి ఎక్కడ ఉండనుందో రెవెన్యూ అధికారులు హద్దులు గుర్తించి రాళ్లు పాతనున్నారు. దీన్ని డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషినింగ్ సిస్టం పరికరాల శాటిలైట్ శాస్త్రీయ సర్వేతో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

ప్రస్తుతమున్న ఔటర్ రింగ్ రోడ్డుకు 30 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేస్తున్న దీనికి జాతీయ హోదాను కట్టబెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రీజనల్ ఔటర్ రింగ్ రోడ్డు అయ్యే ఖర్చు ను కేంద్రం భరించలనుంది.

సర్వే పనులకు రైతుల నుంచి భూములు కోల్పుతున్న వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పీర్లపల్లి గ్రామంలో సర్వే జరిపిన సందర్భంలో రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 191 సర్వే నంబర్ లో 250 ఎకరాల అసైన్డ్ భూమిపై ఎస్సీలు, బీసీల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.వారంతా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు.

తుఫ్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి ప్రాంతాల్లోనూ భూసేకరణ ప్రక్రియ వేగవంతమవుతోంది. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో వేలాది ఎకరాల భూసేకరణ జరుగనుండగా.. రెవెన్యూ యంత్రాంగం పనిలో నిమగ్నమై ఉంది.

ఈరోడ్డు పూర్తయితే హైదరాబాద్ పరిధి చాలా విస్తరిస్తుంది. కొత్త పరిశ్రమలు పుట్టుకొస్తాయి. వివిధ జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు పరిశ్రమలు, అభివృద్ధి విస్తరిస్తుంది.హైదరాబాద్ కు ఆవల మొత్తం 338 కిలోమీటర్ల పొడువు నిర్మాణంతో ఈ రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించనున్నారు. తుఫ్రాన్, గజ్వేల్, జగదేవ్ పూర్, తుర్కపల్లి, భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్, నారాయణపూర్, యాచారం, షాద్ నగర్, పరిగి , పూడూరు, చేవెళ్ల, శంకర్ పల్లి మండలాల మీదుగా ఈ రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ వెళుతుంది.

ప్రస్తుతం ఉత్తర దిశలో ఉన్న చౌటుప్పల్-సంగారెడ్డి మధ్య 182 కి.మీల మేర నిర్మాణం చేపట్టనున్నారు. రెండు దశలకు కలిపి 17వేల కోట్లు హైదరాబాద్ కోసం కేంద్రం ఖర్చు చేయనుంది.. హైదరాబాద్ కు వచ్చే అన్ని హైవేలను ఇది కలుపుతుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ భూసేకరణ పనులను మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ప్రారంభించాలని కిషన్ రెడ్డి కోరారు. ఖరీదైన భూములను సేకరించడం అంత ఈజీ కాకపోవడంతో ఈ బాధ్యతను కేసీఆర్ సర్కార్ పై పెట్టారు. దీంతో అసలు భూసేకరణ కష్టమన్న ప్రచారం సాగుతోంది.

హైదరాబాద్ నగరానికి 50 నుంచి 70కి.మీల దూరంలో ఓఆర్ఆర్ కి 30కి.మీల దూరంలో ఈ రహదారి నిర్మాణం జరుగనుంది.సుమారు 20కిపైగా ముఖ్యనగరాలు, పట్టణాలను కలుపుతూ నిర్మాణం జరుగనున్న ఈ రహదారితో 40శాతం మంది ప్రజలకు రింగురోడ్డు ఉపయుక్తంగా ఉండనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.