Begin typing your search above and press return to search.

రూ.437 కోట్లకు టోపీ పెట్టి జంప్ అయిన యూట్యూబర్

By:  Tupaki Desk   |   3 Sep 2022 4:34 AM GMT
రూ.437 కోట్లకు టోపీ పెట్టి జంప్ అయిన యూట్యూబర్
X
నమ్మినోడ్నే మోసం చేయాలన్న సామెతను చేతల్లో చూపించిన సెలబ్రిటీ యూట్యూబర్ గా ఆమెను చెప్పాలి. చూసినంతనే ఆకర్షణీయంగా ఉండటంతో పాటు తన చలాకీతనంతో అందరి మతులు పోగొట్టే యూట్యూబర్ స్టార్ ఒకరు తన ఫాలోయర్లను నమ్మించి.. రూ.437 కోట్ల భారీ మొత్తాన్ని సేకరించి.. తాజాగా విదేశాలకు జంప్ అయిన వైనం షాకింగ్ గానూ.. థాయ్ లాండ్ దేశంలో సంచలనంగా మారింది. ఇలా కూడా మోసం చేస్తారా? అన్న క్వశ్చన్ కలిగేలా ఆమె తీరు ఉంటుందని చెప్పాలి. ఇంతకీ ఆమె ఎవరు? ఆమెకు అంత భారీగా డబ్బును ఆమె ఫోలోయర్లు ఇచ్చారు? ఈ మోసం ఎంత పెద్దది అన్న విషయాల్లోకి వెళితే..

ప్రపంచం మొత్తం ఇప్పుడు హవా నడుస్తున్నది సోషల్ మీడియా.. యూట్యూబ్ దే. కోట్లాది మంది కొత్త స్టార్లను ప్రపంచానికి పరిచయం చేసిన ఈ మాథ్యమంతో జరిగిన మేలు ఎంత? కీడు ఎంతన్నది ఇప్పుడు చర్చగా మారింది. యూట్యూబ్ స్టార్ గా థాయ్ లాండ్ కు చెందిన నట్టి అలియాస్ నత్తమోన్ ఖోంగ్ చాక్ సుపరిచితులు. ఆమె డ్యాన్సులు.. పాటలు థాయ్ ప్రజల్ని విపరీతంగా అలరిస్తాయి. ఆమె ఎంతటి ప్రభావాన్ని చూపుతారన్న దానికి నిదర్శనంగా ఆమె ఫాలోవర్ల సంఖ్యను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

ఆమెకు 8.47 లక్షల మంది సబ్ స్రైబర్లు ఉన్నారు. తననుతాను మల్టీ టాలెంట్ పర్సన్ గా చెప్పుకునే ఆమెకు మరో గుణం ఉంది. తనను ఫాలో అయ్యే వారిని ఆమె విపరీతంగా ప్రభావితం చేస్తుంటారు. ఆమె చెప్పిందే వేదంగా భావిస్తుంటారు. అంతలా ఆమె తన ఫాలోయర్లను ప్రభావితం చేస్తుంటారు.

కొద్ది రోజుల క్రితం నట్టి డైరీ పేరుతో యూట్యూబ్ అకౌంట్ లో వీడియో పోస్టు చేసి.. తను వాడే లగ్జరీ కార్లు తదితర వస్తువుల్ని చూపించేది. తనకున్న సహజ గుణమైన ఆకర్షణకు ఈ విలాసవంతమైన వస్తువులు పాలోయర్ల మీద తీవ్ర ప్రభావాన్ని చూపేవి. తనను తాను సక్సెస్ ఫుల్ ఫారెక్స్ ట్రేడర్ గా చెప్పుకునే ఆమె.. తన వద్ద పెట్టుబడులు పెట్టే వారికి భారీ లాభాలు ఇస్తానని చెప్పేది. తన అకౌంట్లో డిపాజిట్ చేసిన వారికి మూడునెలల కాలానికి డిపాజిట్ చేస్తే 25 శాతం లాభం.. ఆరు నెలలకు అయితే 30 శాతం.. అదే ఏడాది పాటు పెట్టుబడి ఉంచితే 35 శాతం లాభాల్ని చెల్లిస్తానని హామీ ఇచ్చేది.

మన దగ్గర ఎలా అయితే మల్టీ లెవల్ మోసాలు చేస్తారో.. అదే బాటలో నడిచి.. తన దగ్గర పెట్టుబడులు పెట్టిన వారికి క్రమం తప్పకుండా ఏ నెలకు ఆ నెల లాభాల్ని తిరిగి చెల్లిస్తానని చెప్పటంతో ఆమె మాటలకు పెద్ద ఎత్తున ఆకర్షితులయ్యారు. ఇలాఆమె ఏకంగా రూ.437కోట్ల వరకు వసూలు చేసింది. ఇదిలా ఉంటే.. కొంతకాలం ఆమె చెప్పినట్లే చేసినా.. మేలో మాత్రం ఒక పోస్టు పెట్టి తాను ట్రేడింగ్ లో చిన్న పొరపాటు చేశానని.. ఆ కారణంగా డబ్బు మొత్తాన్ని పోగొట్టుకున్నట్లుగా పేర్కొంది.

అయినప్పటికీ తన వద్ద ఉన్న డబ్బులతో తన దగ్గర పెట్టుబడులు పెట్టిన వారికి ఎలాంటి కష్టం ఉండదని చెప్పింది. నెల తర్వాత మరో బాంబు పేల్చింది. తన మీద రెండు కేసులు వేశారని.. నేరం రుజువైతే తాను జైలుకు వెళ్లాల్సి వస్తుందని.. పెట్టుబడిదారులకు డబ్బులు చెల్లించటం కష్టం అవుతుందని పేర్కొంది. దీంతో ఆమె వద్ద పెట్టుబడులు పెట్టిన వారంతా తమ డబ్బు తిరిగి ఇవ్వాలని కోరటం.. ఒత్తిడి పెరిగిపోయిన ఆమె.. చెప్పాపెట్టకుండా థాయిలాండ్ నుంచి మలేషియాకు జంప్ అయినట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఆమె వద్ద పెట్టుబడులు పెట్టిన వేలాది మంది ఇప్పుడు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. పైపై మెరుపులకు ఆకర్షితులైతే.. పరిస్థితి ఇలానే ఉంటుందన్న మాట వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.