Begin typing your search above and press return to search.

సల్మాన్‌ తండ్రి దాన్ని ఎందుకు తిరస్కరించాడో!

By:  Tupaki Desk   |   19 March 2015 5:18 AM GMT
సల్మాన్‌ తండ్రి దాన్ని ఎందుకు తిరస్కరించాడో!
X
ఈ ఏడాది పద్మపురస్కారాల్లో మొత్తం ఐదు తిరస్కరణకు గురయ్యాయని ప్రకటించింది కేంద్ర హోంశాఖ. రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రతియేడాదీ భారత ప్రభుత్వం పద్మపురస్కారాలను ప్రకటిస్తుంది. వివిధ రంగాల్లో రాణించిన, అత్యుత్తమ సేవలు అందించిన ప్రముఖులకు ప్రభుత్వం ఈ పురస్కారాలను ప్రదానం చేస్తుంది.

ఈ పరంపరలో ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం అనేక మంది ప్రముఖులకు పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ పురస్కారాలను ప్రదానం చేసింది. అయితే ఇలాంటి వారిలో మొత్తం ఐదు మంది పురస్కారాలను తిరస్కరించారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ మేరకు లోక్‌సభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్‌ ఒక ప్రకటన చేశారు. మొత్తం ఐదు మంది పురస్కారాలను తిరస్కరించారని.. వారు ఈ అవార్డులను తీసుకోవడానికి ముందుకు రాలేదని ఆయన తెలిపారు.

ఇలాంటి వారిలో బాలీవుడ్‌ సినీ రచయిత సలీమ్‌ ఖాన్‌ కూడా ఉండటం విశేషం. సలీమ్‌-జావేద్‌లలో ఒకరిగా పేరెన్నిక కలిగిన రచయిత సలీమ్‌ఖాన్‌. అంతే కాదు.. నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఆయన తనయుడే. కళారంగంలో సేవలకు గానూ సలీమ్‌ ఖాన్‌కు ప్రభుత్వం పద్మపురస్కారాన్ని ప్రకటించింది. అయితే ఆయన మాత్రం ఆ అవార్డును తీసుకోవడానికి సమ్మతించలేదని.. అవార్డును తిరస్కరించారని కేంద్ర హోం శాఖ ప్రకటించింది. మరి సల్మాన్‌ తండ్రి ఎందుకు తిరస్కరించారో!