Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ స‌ర్కారుకు పొంచి ఉన్న ఇసుక క‌ష్టాలు.. ఎన్టీటీ క‌మిటీ.. ఏం జ‌రుగుతుంది?

By:  Tupaki Desk   |   30 Aug 2021 2:30 PM GMT
జ‌గ‌న్ స‌ర్కారుకు పొంచి ఉన్న ఇసుక క‌ష్టాలు.. ఎన్టీటీ క‌మిటీ.. ఏం జ‌రుగుతుంది?
X
ఏపీలో ఇసుక అక్ర‌మ త‌వ్వ‌కాల‌పై అందిన ఫిర్యాదుల నేప‌థ్యంలో జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్ ఓ సంయుక్త క‌మిటీని ఏర్పాటు చేసింది. ప‌లు జిల్లాల్లో ఇసుక‌ను అక్ర‌మంగా త‌వ్వితీసి.. అక్ర‌మార్కులు వ్యాపారం చేసుకున్నారని.. దీనివ‌ల్ల‌.. న‌దీ గ‌ర్భాలు నాశ‌నం అయి.. ప‌ర్యావ‌ర‌ణం పూర్తిగా దెబ్బ‌తింద‌ని పేర్కొంటూ.. కొంద‌రు ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడు ఎన్టీటీ నియ‌మించిన సంయుక్త క‌మిటీ(దీనిలో రాష్ట్రానికి చెందిన అధికారులు కూడా ఉన్నారు) ఆయా జిల్లాల్లో ప‌ర్య‌టించి.. న‌దుల‌ను ప‌రిశీలించి.. నివేదిక ఇవ్వ‌నున్నారు.

ఏం జ‌రిగింది?

ఏపీలోని కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా, వంశధారతో పాటు మరికొన్ని నదులు, వాటి ఉపనదులు, కాలవల్లో లభించే ఇసుకకు ఎంతో విలువ ఉంది. దీన్ని సొంతం చేసుకుంటే కోట్లాది రూపాయలు ఆర్జించవచ్చనే దురాశ‌తో అక్రమార్కులు ఆయా న‌దుల‌ను తోడేస్తున్నారు. అయితే.. ఎవ‌రు అధికారంలో ఉంటే.. ఆ పార్టీ నేత‌లే ఇలాంటి ఆగ‌డాలు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. రూ. కోట్ల నిధులు చేతులు మార‌డంతో ఎవ‌రికి వారు మౌనం వ‌హిస్తుంటారు.

టీడీపీ హ‌యాంలోనూ..

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరిగిపోయేది. ప్రభుత్వం చూసీ చూడనట్లుగా వ్యవహరించడంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలే కోట్లాది రూపాయల ఇసుక ను త‌వ్వి తీశారు. ఈ క్ర‌మంలోనే దెందులూరు అప్ప‌టి ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ అనుచ‌రులు త‌హ‌సీల్దార్ వ‌న‌జాక్షిపై చేయిచేసుకున్నార‌నే కేసులు కూడా న‌మోద‌య్యాయి. అయితే.. ఇలా న‌దుల‌ను దోచేయ‌డానికి కేంద్ర చ‌ట్టాలుముఖ్యంగా ప‌ర్యావ‌ర‌ణ చ‌ట్టాలు ఏమాత్రం అనుమ‌తించ‌వు. తేడా వ‌స్తే.. కోట్ల రూపాయ‌ల్లోనే జ‌రిమానా విధిస్తాయి. ఇలానే గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి ఎన్జీటీ రూ.100 కోట్ల రూపాయ‌ల జ‌రిమానా విధించింది.

ఇప్పుడు ఏం జ‌రుగుతుంది?

వైసీపీ హ‌యాంలోనూ ఇసుక అక్ర‌మాలు పెరిగిపోయాయి. వైసీపీ సర్కార్ హయాంలో ఇసుక తవ్వకాల కోసం లీజుల్ని జయప్రకాష్ వెంచర్స్ అనే సంస్దకు కట్టబెట్టారు. ఈ సంస్ధ పలు చోట్ల సాగిస్తున్న తవ్వకాల్లో వైసీపీ నేతల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో జేపీ వెంచర్స్ కేంద్రంగా జరుగుతున్న ఈ అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఎన్టీటీ తాజాగా సీరియస్ అయింది. అక్రమ ఇసుక తవ్వకాల గుట్టు విప్పేందుకు విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా తనిఖీలు చేపట్టి అక్టోబర్ 5లోగా నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించింది. ఈ వివరణ సంతృప్తి కరంగా లేకపోతే ఎన్టీటీ ఏం చేయబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.

ఇసుక సంక్ష‌భం వ‌చ్చే ఛాన్స్‌!

ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాల నేపథ్యంలో ధరలు ఆకాశాన్నంటున్నాయి. గతంతో పోలిస్తే ప్రతీ చోటా భారీగా ధర పెరిగింది. అయినా తప్పనిసరి పరిస్దితుల్లో జనం ఇసుక కొనుగోలు చేస్తున్నారు. ఇందులోనూ రవాణా పేరుతో భారీగా దోపిడీ జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ సర్కార్ ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోను సైతం ఏర్పాటు చేసింది. ఇందులో వేలాది మంది సిబ్బందిని సైతం నియమించారు. అయినా ఇసుక అక్రమ తవ్వకాలు కానీ, అక్రమ రవాణా కానీ ఆగకపోవడంతో ఇసుక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక‌, ఎన్జీటీ క‌నుక నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌తరం చేస్తే.. మ‌రోసారి ఏపీలో ఇసుక సంక్షోభం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.