Begin typing your search above and press return to search.

వ‌లంటీర్ల‌కు ఉన్న ప‌వ‌ర్ మాకు లేదు: ఏపీ గ్రామ స‌ర్పంచ్‌లు

By:  Tupaki Desk   |   11 Dec 2021 6:00 PM IST
వ‌లంటీర్ల‌కు ఉన్న ప‌వ‌ర్ మాకు లేదు:  ఏపీ గ్రామ స‌ర్పంచ్‌లు
X
భారతదేశంలోనే గ్రామ పరిపాలనలో సర్పంచ్ ప‌ద‌వికి ప్రత్యేకమైన స్థానం ఉంది. రాజస్థాన్లో మొట్టమొదటిసారిగా 1957వ సంవత్సరంలో గ్రామ పంచాయతీ పాలన ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు కూడా సర్పంచ్ పదవికి ఉన్న క్రేజ్ రోజురోజుకు పెరుగుతూ వస్తోంది.

సర్పంచ్ అనే వాడు గ్రామానికి రారాజు... ప్రథమ పౌరుడు. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా... ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా... ఎలాంటి నిర్ణయాలు కూడా స‌ర్పంచ్ క్రేజ్‌ను ఎప్పుడూ త‌గ్గించ‌లేదు.

అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సర్పంచ్‌ల ప్రాభావం మసకబారుతోందా ? అంటే అవుననే చర్చలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన దగ్గర నుంచి ... శాంతిభద్రతల పరిరక్షణ, అభివృద్ధి, ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్ కు తిరుగులేని ప్రాధాన్యం ఉండేది. అయితే ఇపుడు సర్పంచ్ నుంచి అధికారాలు క్రమక్రమంగా ప్రభుత్వం లాగేసుకుంటోన్న‌ పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే చాలా అధికారాలను ఇతరులకు బదిలీ చేశారు.

ఆర్థిక సంఘం నిధులు కూడా సర్పంచ్ ల తో సంబంధం లేకుండా పక్కదారి పట్టిస్తున్నారు. ఇప్పుడు సర్పంచ్ పేరుకు మాత్రమే పదవిలో ఉంటున్నారే తప్ప వారిని వైసీపీ ప్రభుత్వం ఉత్సవ విగ్రహాలుగా మార్చేస్తుందన్న‌ ఆవేదన వినిపిస్తోంది.

చాలా మంది సర్పంచ్‌లు ప్రజలకు సేవ చేద్దామని... లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మరి గత ఎన్నికల్లో గెలిచారు. అయితే ఇప్పుడు గ్రామ సర్పంచ్ గా ఉన్న చివరకు తమ గ్రామంలో రోడ్డు కూడా వేసుకోలేని స్థితిలో ఉన్నామని వారు వాపోతున్నారు.

ఇప్ప‌టికే స‌చివాల‌యాల ఏర్పాటుతో చాలా వ‌ర‌కు ప‌నులు వారి చేతుల్లోకి వెళ్లిపోయాయి. చివ‌ర‌కు వ‌లంటీర్ల‌కు ఉన్న ప్రాధాన్యం కూడా త‌మ‌కు లేద‌ని వారు గొణుక్కుంటున్నారు.

ఇక నిధుల విష‌యానికి వ‌స్తే చిన్న చిన్న ప‌నుల‌కు కూడా ఇప్పుడు స‌ర్పంచ్‌లు ఎమ్మెల్యేల వైపు చూస్తున్నారు. అస‌లు చాలా పంచాయ‌తీల్లో చిల్లిగవ్వ కూడా లేదు. పారిశుధ్య ప‌నులు చేసేందుకు కూడా డ‌బ్బులు లేవు.

14వ ఆర్థిక సంఘం నిధుల‌ను ప్ర‌భుత్వం విద్యుత్ బిల్లుల బకాయిల కింద జ‌మ వేసుకుంది. వీటి గురించి అడిగే ప‌రిస్థితి లేదు. ఇక కొత్త పంచాయ‌తీలు పాల‌క వ‌ర్గాలు చేప‌ట్టాక వారికి తెలియ‌కుండానే 15వ ఆర్థిక సంఘం నిధులు లాగేసుకుంది. ఇక ఇంటి ప‌న్ను, నీటి ప‌న్ను, ఆస్తి బ‌దిలీ ప‌న్ను వంటివి నేరుగా ప్ర‌భుత్వ ఖాతాల్లో జ‌మ అవుతున్నాయి. ఇవి తిరిగి పంచాయ‌తీల‌కు ఇవ్వ‌డం లేద‌ట‌. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స‌ర్పంచ్‌ల బాధ వ‌ర్ణ‌నాతీతంగా ఉంది.