Begin typing your search above and press return to search.

పాత నోట్ల దందా లో చిన్నమ్మ .... ఎన్ని కోట్లు మార్చిందంటే ?

By:  Tupaki Desk   |   23 Dec 2019 3:45 PM IST
పాత నోట్ల దందా లో చిన్నమ్మ .... ఎన్ని కోట్లు మార్చిందంటే ?
X
ఏఐఏడీఎంకే చీఫ్ , తమిళనాడు మాజీ సీఎం జయలలిత గారికి స్నేహితురాలు వీకే శశికళ తాజాగా మరో వివాదం లో చిక్కుకున్నారు. ఈమె ఇప్పటికే పలు కేసుల్లో నిందితురాలుగా ఉంది. ఇటువంటి సమయంలోనే తాజాగా డీమానిటైజేషన్ అనంతరం.. పెద్ద నోట్ల తో భారీగా ఆస్తులు సమకూర్చుకున్నట్లు ఐటీ శాఖ తమ నోటీసులో ఆరోపించింది. వాటి విలువ దాదాపు రూ.1674.50 కోట్లగా ఐటి శాఖ గుర్తించింది.

శశికళ కి ఆస్తులు అమ్మిన వ్యక్తులు.. రద్దైన ఆ పాత నోట్ల ను 2016 నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30 మధ్య వివిధ బ్యాంక్ అకౌంట్ల లో డిపాజిట్ చేసినట్టు ఐటీ శాఖ నోటీసుల్లో పొందుపరిచింది. కేంద్రం పెద్ద నోట్ల రద్దు ప్రకటించగానే.. శశికళ చెన్నై,పెరంబూరు, మదురై, కేకే నగర్‌ ప్రాంతాల్లో షాపింగ్‌ మాల్స్‌, ఇక పుదుచ్చేరిలో ఓ రిసార్ట్ కొనగోలు చేశారు. అలాగే కోయంబత్తూరు లో పేపర్‌ మిల్‌ ను, చెన్నై ఒరగడం లో చక్కెర మిల్లును, పాత మహా బలిపురం రోడ్డు లో సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ, కోయంబత్తూరు లో 50 పవన విద్యుత్‌ ప్లాంట్‌ లను శశికళ కొనుగోలు చేసినట్లు ఐటీశాఖ తరఫు లాయర్ ఆధారాలను కోర్టుకు సమర్పించారు.

అయితే శశికళ కొన్న మొత్తం ఆస్తులని పూర్తిగా నగదు ద్వారానే డబ్బు వ్యవహారం జరిగినట్లు తెలిపారు. కాగా, మద్రాసు హైకోర్టులో ఆదాయానికి సంబంధించిన ఓ పిటిషన్‌ పై స్టే విధించాలంటూ శశికళ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై వివరణ ఇవ్వాలంటూ కోర్టు.. ఐటీ శాఖను ఆదేశించింది.శనివారం న్యాయమూర్తి అనితా సుధాకర్‌ ముందు ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. దీనిని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి త్వరితగతిన అన్ని ప్రక్రియలు ముగించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను వాయిదా వేశారు.