Begin typing your search above and press return to search.

స‌త్య కుమార్ కు సొంత పార్టీ ఇచ్చిన షాక్ ఇదే!

By:  Tupaki Desk   |   12 July 2022 3:29 AM GMT
స‌త్య కుమార్ కు సొంత పార్టీ ఇచ్చిన షాక్ ఇదే!
X
ఎన్డీఏ త‌ర‌ఫున‌ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని తాము వైఎ‍స్సార్‌సీపీని కోరలేదంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బీజేపీ అధిష్టానం ఖండించింది. అదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతు కోరలేదని సత్యకుమార్‌ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమ‌ని వెల్ల‌డించింది. ఈ మేర‌కు కేంద్ర జ‌ల‌శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర షెకావ‌త్ స్ప‌ష్ట‌త ఇచ్చారు.

ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బీజేపీ అధిష్టానం కోరింద‌ని కేంద్ర మంత్రి షెకావ‌త్ వెల్ల‌డించారు. ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్‌తో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యక్తిగత సంప్రదింపులు కూడా జరిపారని పేర్కొన్నారు.

నామినేషన్‌ దాఖలు సమయంలో ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి కూడా హాజరై మద్దతు తెలిపార‌ని కేంద్ర మంత్రి గ‌జేంద్ర‌ షెకావత్ గుర్తు చేశారు. ఈ మేరకు సత్యకుమార్‌ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని షెకావత్‌ స్పష్టం చేశారు.

వైఎస్సార్సీపీ విష‌యంలో సత్యకుమార్‌ చేసిన వ్యాఖ్యలు ఆయ‌న‌ వ్యక్తిగతం అని షెకావ‌త్ తెలిపారు. ఆయన మాటలు, ఆలోచనలతో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని షెకావత్‌ స్పష్టం చేశారు.

స్వయంగా ప్రధాని మోదీ, జగన్‌కు ఫోన్‌ చేసి మరీ మాట్లాడారని.. ఆ తర్వాతే ముర్ముకు మద్దతు ప్రకటించామన్నారు.. వైఎస్సార్సీపీ బంద‌రు ఎమ్మెల్యే పేర్ని నాని మీడియాతో చెప్పిన సంగ‌తి తెలిసిందే. దీనిపై స్పందించిన‌ సత్యకుమార్ ఇప్పుడే కాదు.. గతంలోనూ తామెప్పుడూ వైఎస్సార్సీపీ మద్దతు కోర‌లేద‌ని తెలిపారు. వైఎస్సార్సీపీ మ‌ద్ద‌తు కూడా త‌మ‌కు ఏ రకంగానూ అవసరంలేదంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

ఈ నేప‌థ్యంలో ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తు విష‌యంలో రాష్ట్రానికి చెందిన జాతీయ నేత‌లు ఒక‌లా.. ఢిల్లీ నేతలు మరోలా వ్యవహరించడం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అందులోనూ జూలై 12 ద్రౌప‌ది ముర్ము ఏపీకి వ‌స్తున్నారు. సీఎం వైఎస్ జ‌గ‌న్ ను క‌లిసి ఆయ‌న మ‌ద్ద‌తును కోరనున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ నేత‌ల కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.