Begin typing your search above and press return to search.

స్కూటరు 70 వేలు.. నంబరుకు రూ.15 లక్షలు

By:  Tupaki Desk   |   20 April 2022 1:30 AM GMT
స్కూటరు 70 వేలు.. నంబరుకు రూ.15 లక్షలు
X
అభిమానం.. పిచ్చి.. ఆరాధన.. ఇష్టం.. ఇలా ఏదైనా పేరు పెట్టుకోండి. కొందరికి కొన్నంటే అంతే. ఒకరు ప్రయాణాన్ని ఇష్ట పడతారు. మరొకరు పుస్తక పఠనాన్ని ఇష్టపడతారు. ఇంకొకరు సినిమాలను ఇష్టపడతారు. ఇలాంటి ఇష్టాల కోవలోకే ఫ్యాన్సీ నంబర్లకు డబ్బుల ఖర్చు కూడా వస్తుంది. మనదగ్గర పెద్దపెద్ద సినీ తారలు, వ్యాపారులు, ప్రముఖులు తమకు వాహనాలకు ఇష్టమైన నంబర్ల కోసం ఎంతైనా ఖర్చు పెడుతుంటారు. ఇలానే హరియాణకు చెందిన ఓ వ్యక్తి కూడా.

పది రెట్ల ఎక్కువ ఖర్చుతో..

తమ ప్రభుత్వం ‘0001’ నంబరు ప్లేట్లను వేలంలో ఉంచుతుందంటూ హరియాణ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఇటీవల ప్రకటించారు. సాధారణ ప్రజల కోసం ఈ అందుబాటు అని తెలిపారు. ఇదే సమయంలో మరింత ఆదాయం సమకూర్చుకునేందుకు ఆయన ఈ పథకం తెచ్చారు. దీనిని అవకాశంగా తీసుకున్నాడు ఓ బ్రిజ్ మోహన్.

ఇతడు ఇటీవల రూ.70 వేలు చెల్లించి యాక్టివా వాహనాన్ని కొన్నాడు. దీనికి నంబరు ‘0001’ కోసం ఏకంగా రూ.15.4 లక్షలు వెచ్చించాడు. ఛండీగఢ్ రిజస్టరింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీలో దీనికి సంబంధించి ఇటీవల వేలం నిర్వహించగా బ్రిజ్ మోహన్ ‘‘0001’’ ను సొంతం చేసుకున్నాడు. అదిప్పుడు సంచలనమై కూర్చుంది. సోషల్ మీడియాలో ఇదే అదనుగా మీమ్స్ వదులుతున్నారు. సూపర్ వీఐపీ ప్లేట్ అంటూ జోక్స్ వేస్తున్నారు.

యాడ్ ఏజెన్సీ నిర్వాహకుడు

రూ.70 వేల స్కూటర్ కు రూ.15 లక్షల ఖర్చు పెట్టి ఫ్యాన్సీ నంబరు సీహెచ్ 01 -సీజే-0001 ను తెచ్చుకున్న మోహన్.. యాడ్ ఏజెన్సీ నిర్వాహకుడు. కాగా, ఛండీగఢ్ రిజస్టరింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ వేలంలో మొత్తం 378 నంబర్లను ఉంచింది. దీనికిగాను రూ.1.5 కోట్ల ఆదాయం సాధించింది. ఇంతకూ మోహన్ పొందిన సీహెచ్ 01 -సీజే-0001 నంబరుకు ప్రాథమిక ధర ఎంతని అనుకుంటున్నారు..? రూ.5 లక్షలు. అయితే, వేలంలో దీనికి రెండింతలు ఖర్చు పెట్టి మోహన్ సొంతం చేసుకున్నాడు.

రిజర్వు చేస్తాడట..?

ఇంతకూ ఎందుకింత ధర పెట్టారని మోహన్ ను అడిగితే.. ఈ నంబరు సీహెచ్ 01 -సీజే-0001 ను రిజర్వు చేస్తానని, భవిష్యత్ లో అంటే దీపావళికి కొనబోయే వాహనం కోసం అట్టిపెడతానని చెప్పాడు. అప్పటివరకు యాక్టివాకు వాడతానని తెలిపాడు. అతడు కారు కొనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు హరియాణలో 179 వ్యక్తిగత వాహనాలు 0001ను వినియోగిస్తున్నాయి. ఇందులో నాలుగు వాహనాలు హరియాణ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వే కావడం విశేషం. ఇటీవల ఆయన ఈ నంబర్లను సాధారణ పౌరులకూ ఇవ్వాలని నిర్ణయించారు. వేలం ద్వారా ఆదాయం కోసం ఈ ఆలోచన చేశారు. ఇంతకూ ఇలాంటి ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా సమకూరిన మొత్తం ఎంతని అనుకుంటున్నారు...? రూ.18 కోట్ల పైనే..