Begin typing your search above and press return to search.

పార్టీల‌కు ర‌హస్య విరాళాలు.. ఈ పార్టీల‌కే ఎక్కువ‌!

By:  Tupaki Desk   |   27 Aug 2022 5:04 AM GMT
పార్టీల‌కు ర‌హస్య విరాళాలు.. ఈ పార్టీల‌కే ఎక్కువ‌!
X
దేశంలో రాజ‌కీయ పార్టీల‌కు ఎన్నికల విరాళాలకు సంబంధించి అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్ (ఏడీఆర్) కీలక నివేదికను బయటపెట్టింది. ఆర్థిక సంవత్సరం 2004-05 నుంచి 2020-21 మధ్య జాతీయ పార్టీలకు గుర్తు తెలియ‌ని మూలాల నుంచి రూ.15,077 కోట్లు ర‌హ‌స్య‌ విరాళాల రూపంలో అందినట్లు బాంబుపేల్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలోనే జాతీయ, ప్రాంతీయ పార్టీలకు రూ.690.67 కోట్లు ఇలా ర‌హ‌స్య విరాళాలు అందినట్లు తెలిపింది. త‌న నివేదిక కోసం మొత్తం 8 జాతీయ పార్టీలు, 27 ప్రాంతీయ పార్టీలను ఏడీఆర్‌ పరిగణనలోకి తీసుకుంది. 2004-05, 2020-21 మధ్య కాలంలో ఆయా పార్టీలు కేంద్ర‌ ఎన్నికల సంఘం (ఈసీ) వద్ద సమర్పించిన ఆదాయ‌ప‌న్ను రిటర్నులు, విరాళాల‌కు సంబంధించిన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించామ‌ని వెల్ల‌డించింది.

జాతీయ పార్టీలలో.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ), భార‌త జాతీయ‌ కాంగ్రెస్ (ఐఎన్సీ), ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సీపీఎం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) ఉన్నాయి.

ప్రాంతీయ పార్టీలలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ), తెలుగుదేశం పార్టీ (టీడీపీ), తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్) ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ), అసోం గ‌ణ‌ప‌రిష‌త్ (ఏజీపీ), ఆల్ ఇండియా అన్నాద్ర‌విడ మున్నేట్ర క‌జ‌గం (ఏఐఏడీఎంకే), ఆల్ ఇండియా మ‌జ్లిస్ ఇత్తెహ‌దుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం), ఏఐయూడీఎఫ్, బిజూ జ‌న‌తాద‌ళ్ (బీజేడీ), సీపీఐ(ఎంఎల్-ఎల్), ద్ర‌విడ మున్నేట్ర ద్ర‌విడ క‌జ‌గం (డీఎండీకే), ద్ర‌విడ మున్నేట్ర క‌జ‌గం (డీఎంకే), జీఎఎఫ్పీ, జ‌నతాద‌ళ్ సెక్యుల‌ర్ (జేడీఎస్), జ‌న‌తాద‌ళ్ యునైటెడ్ (జేడీయూ), జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కేర‌ళ కాంగ్రెస్ మ‌ణి (కేసీఎం), మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ సేన (ఎంఎన్ఎస్‌), ప‌ట్టాల్ మ‌క్క‌ల్ క‌చ్చి (పీఎంకే), రాష్ట్రీయ లోక్ ద‌ళ్ (ఆర్ఎల్డీ), శిరోమ‌ణి అకాలీద‌ళ్ (ఎస్ఏడీ), శివసేన తదిత‌ర పార్టీలు ర‌హ‌స్య విరాళాలు పొందిన‌వాటిలో ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.

2020-21 ఆర్థిక సంవత్సరానికి... ఎనిమిది జాతీయ పార్టీలు గుర్తు తెలియని మూలాల నుంచి ₹ 426.74 కోట్ల విరాళాల్ని పొందాయి. అలాగే 27 ప్రాంతీయ పార్టీలు గుర్తు తెలియని మూలాల నుంచి ₹ 263.928 కోట్ల విరాళాల‌ను ద‌క్కించుకున్నాయి.

ఇక పార్టీల‌వారీగా చూస్తే.. కాంగ్రెస్ తెలియని మూలాల నుంచి ₹178.782 కోట్లు పొందింది. అలాగే బీజేపీ ₹100.502 కోట్లు విరాళాల‌ను గుర్తు తెలియ‌ని మూలాల నుంచి సేక‌రించింది. జాతీయ పార్టీల మొత్తం విరాళాల్లో 23.55% తెలియని మూలాల నుంచే రావ‌డం గ‌మ‌నార్హం.

ఇక ప్రాంతీయ పార్టీలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల నుంచి ర‌హ‌స్య విరాళాలు పొందిన‌వాటిలో వైఎస్సార్-కాంగ్రెస్ పార్టీ రూ. 96.2507 కోట్లతో టాప్ లో నిలిచింది. త‌మిళ‌నాడులో అధికార పార్టీ డీఎంకే రూ.80.02 కోట్లు, బిజూ జ‌న‌తాద‌ళ్ (బీజేడీ) రూ.67 కోట్లు, మ‌హారాష్ట్ర న‌వ నిర్మాణ సేన
(ఎంఎన్ఎస్) రూ. 5.773 కోట్లు, ఆప్ రూ.5.4 కోట్లు పొందాయి.

జాతీయ, ప్రాంతీయ పార్టీలకొచ్చిన మొత్తం రూ.690.67 కోట్ల నిధుల్లో 47.06 శాతం ఎలక్టోరల్‌ బాండ్ల నుంచి వచ్చినట్లు ఏడీఆర్ వెల్ల‌డించింది.