Begin typing your search above and press return to search.

గంజాయి స్మగ్లింగ్ తో అయ్యన్న డాన్ గా మారారు: సొంత సోదరుడి సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   18 Sep 2021 4:30 PM GMT
గంజాయి స్మగ్లింగ్ తో అయ్యన్న డాన్ గా మారారు: సొంత సోదరుడి సంచలన వ్యాఖ్యలు
X
దివంగత నేత కోడెల శివప్రసాద్ వర్ధంతి సభలో సీఎం జగన్, మంత్రులపై మాజీ మంత్రి.. టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ, టీడీపీ కార్యకర్తలు, నేతల మధ్య ఘర్షణ కూడా జరిగింది. ఈ క్రమంలోనే అయ్యన్నపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ రెండు వర్గాలపై కేసుల వరకూ వ్యవహారం వెళ్లింది.

తాజాగా అయ్యన్నపాత్రుడిపై ఆయన సొంత సోదరుడు, వైసీపీ నేత సన్యాసిపాత్రుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గంజాయి స్మగ్లింగ్ కార్యకలాపాలతో అయ్యన్నపాత్రుడు డాన్ గా మారాడని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పాలనను చూసి ఓర్వలేకనే అయ్యన్న ఇలా మాట్లాడుతున్నారని సన్యాసిపాత్రుడు మండిపడ్డారు. అయ్యన్న వ్యాఖ్యలను నిరసిస్తూ చంద్రబాబు ఇంటి వద్ద నిరసన తెలియజేందుకు వెళ్లిన జోగిరమేశ్ పై బుద్దా వెంకన్న, టీడీపీ గుండాలు దాడి చేశారని ఆరోపించారు.

నర్సీపట్నం గంజాయి స్మగ్లింగ్ చేసి అయ్యన్నపాత్రుడు డాన్ గా తయారయ్యాడని సన్యాసి పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో నర్సీపట్నం మున్సిపల్ మహిళా కమిషనర్ ను బట్టలు ఊడదీస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

అయ్యన్నపాత్రుడు అక్రమాస్తుల చిట్టా బయటకు తీస్తామని.. అందులో చంద్రబాబు వాటా ఎంతో తేలుస్తామని సన్యాసిపాత్రుడు అన్నారు. అయ్యన్నకు పిచ్చికుక్కకు తేడా లేదని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులను తాలిబన్లుగా మార్చారని విమర్శించారు.

కోడెల వర్ధంతి సభలో అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ఏకంగా చంద్రబాబు ఇంటి వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఇరు పార్టీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలోనే అయ్యన్నపాత్రుడిపై గుంటూరు జిల్లా నకరికల్లు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మాజీ సర్పంచ్, వైసీపీ నేత కంఠంనేని కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.