Begin typing your search above and press return to search.

అమలాపురం అల్లర్లలో మరో ఏడుగురి అరెస్ట్‌.. 150కి చేరిన అరెస్టులు

By:  Tupaki Desk   |   17 Jun 2022 6:32 AM GMT
అమలాపురం అల్లర్లలో మరో ఏడుగురి అరెస్ట్‌.. 150కి చేరిన అరెస్టులు
X
ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా అమలాపురంలో అల్లర్లు, విధ్వంసకర ఘటనలకు సంబంధించిన కేసుల్లో మరో ఏడుగురు నిందితులను తాజాగా అరెస్ట్‌ చేశారు. దీంతో ఈ కేసుల్లో ఇప్పటి వరకు అరెస్టయినవారి సంఖ్య 150కు చేరింది. అరెస్టులు, దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా పోలీసులు అరెస్టు చేసినవారిలో అమలాపురం పట్టణం హనుమాన్‌ వీధికి చెందిన పిల్లి పృథ్వీరాజ్, అమలాపురం మండలం జనుపల్లెకి చెందిన దర్ల నాగేంద్ర, గుత్తుల మణికంఠ, అదే మండలం ఇందుపల్లికి చెందిన చొల్లంగి ధన భూషణం, రావులపాలెం మండలం దేవరపల్లికి చెందిన కాండ్రేగుల శివన్నారాయణ, ఉప్పలగుప్తం మండలం వాడపర్రుకు చెందిన కడలి అంజనీప్రసాద్, అంబాజీపేట మండలం గంగలకుర్రుకు చెందిన దొమ్మేటి కిరణ్‌బాబు ఉన్నారు. కాగా కోనసీమలో 144 సెక్షన్, పోలీసు సెక్షన్‌ 30 ఇంకా అమలులోనే ఉన్నాయి.

రవాణా శాఖ మంత్రి విశ్వరూప్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లను తగులబెట్టడంతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన అల్లరి మూకలపై రాజకీయాలకు అతీతంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వీడియో, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు.

ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేసిన వారిలో అధికార పార్టీ వైఎస్సార్సీపీతో సహా టీడీపీ, బీజేపీ, జనసేన చెందినవారు ఉన్నారు. ఏ పార్టీలకు చెందనివారు అత్యధికంగా 50 మంది ఉన్నారు. దాడుల్లో ప్రమేయం ఉందని భావించిన వైఎస్సార్‌సీపీకి చెందినవారిని కూడా పోలీసులు అరెస్టు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇప్పటివరకు పోలీసులు 268 మంది ఆందోళనకారులను గుర్తించారు. ఇప్పటికే 150 మందిని అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న 126 మంది కోసం ఏడు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. నిందితులను సాంకేతిక ఆధారాలతో గుర్తిస్తున్నారు. సీసీ ఫుటేజీలు, గూగుల్‌ ట్రాక్‌లు, టవర్‌ లొకేషన్లు, వాట్సాప్‌ గ్రూపులు వంటి సాంకేతిక సాధనాల ఆధారంగా ఈ కేసులను 14 పోలీసు బృందాలు అత్యంత శాస్త్రీయంగా దర్యాప్తు చేస్తున్నాయి.

మరోవైపు పథకం ప్రకారం అమలాపురంలో విధ్వంసకర ఘటనలకు, అల్లర్లకు పాల్పడిన ఆందోళనకారులను ఎవరినీ వదలబోమని పోలీసులు చెబుతున్నారు. ఈ అల్లర్లలో కేసులు నమోదైన నిందితులందరిపైనా త్వరలోనే రౌడీషీట్లు తెరుస్తామని అంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసిన నేరానికి వారిపై పీడీపీపీ యాక్టు కింద కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

అలాగే కేసుల్లో ఉన్న ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఆస్తులను అకౌంట్‌బులిటీ చేస్తున్నారు. ఇప్పటికే నిందితుల వ్యక్తిగత ఆస్తులపై రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ అధికారులతో అంచనాలు తయారు చేయించారు. నిందితుల ఆస్తులపై సుప్రీంకోర్టు, హైకోర్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసంలో మార్కెట్‌ రేట్లకు రెండురెట్లు అదనంగా నిందితుల వ్యక్తిగత ఆస్తుల నుంచి రికవరీ చేసే యోచనలో ఉన్నారు.