Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను క‌న్వీన్స్ చేయ‌లేనంటున్న డిప్యూటీ సీఎం

By:  Tupaki Desk   |   16 July 2017 6:51 AM GMT
కేసీఆర్‌ ను క‌న్వీన్స్ చేయ‌లేనంటున్న డిప్యూటీ సీఎం
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్రశేఖరరావు త‌న‌లోని ఉగ్ర న‌ర‌సింహుడి రూపాన్ని సొంత ఎమ్మెల్యేపైనే ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌హ‌బూబాబాద్‌కు చెందిన ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా గుర్రుగానే ఉన్నారు. రెండు రోజులపాటు వ్యక్తిగతంగా సీఎం అపాయింట్‌ మెంట్‌ కోసం శంకర్‌ నాయక్‌ ప్రయత్నించినా ఆయన నిరాకరించడంలో ఇందులో భాగ‌మ‌ని అంటున్నారు. త్వ‌ర‌లో ఆయ‌నపై సీఎం కేసీఆర్ వేటు వేయ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నెల 12వ తేదీన మహబూబాబాద్‌ లో మూడో విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ - మహిళా కలెక్టర్‌ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెల్సిందే. దీనిపై ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని ఐఏఎస్‌ లు సీఎంను కలిశారు. ఇదే విషయమై వివరణ ఇచ్చేందుకు మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను కలిసేందుకు ఎర్రవల్లి గ్రామంలోని సీఎం ఫాం హౌస్‌ కు వెళ్లారు. అయితే సీఎం అపాయింట్‌ మెంట్‌ ఇవ్వలేదు. దీంతో ప్రధాన గేటు వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అపాయింట్‌ మెంట్‌ లేకుండా లోపలికి అనుమతి లేదని శంకర్‌ నాయక్‌ కు తేల్చిచెప్పారు. దీంతో ఆయన హైదరాబాద్‌ కు తిరిగి వెళ్లారు. శనివారం నేరుగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నా సీఎం అపాయింట్‌ మెంట్‌ దొరకలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శంకర్‌ నాయక్‌ క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయానికి వచ్చి సీఎం పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ (పీఆర్‌ ఓ) కార్యాలయంలో కూర్చున్నారు. అక్కడనుండి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలుసుకున్నారు. క్షమాపణ చెప్పినా తనపై సీఎం ఇంకా ఆగ్రహంగా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. జిల్లా కలెక్టర్‌ పట్ల తాను అమర్యాదగా ప్రవర్తించలేదని, అయినా తనపై కేసు నమోదు చేయించడం ఏమిటని కడియంను ప్రశ్నించినట్టు తెలిసింది.

అయితే ఈ విషయంలో కడియం కూడా చేతులెత్తేసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పిన వెంటనే క్షమాపణ చెప్పకుండా ఆలస్యం చేయడం, ఆ తర్వాత తన తప్పేమీ లేదని మీడియాతో మాట్లాడటం సరికాదు అని చెప్పినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారని, ఇందులో తాను జోక్యం చేసుకోలేనని కడియం సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ఈ కేసులో టీఆర్‌ ఎస్ పార్టీ నుండి శంకర్‌ నాయక్‌ ను సస్పెండ్‌ చేస్తారని అధికారపార్టీ వర్గాలు అంటున్నాయి. విచారణ అనంతరం ఆయనపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని జోరుగా ప్ర‌చారం సాగుతోంది.