Begin typing your search above and press return to search.

పోలీసుల్ని కుక్కల్లా వాడుకోవటం మగతనం కాదు!

By:  Tupaki Desk   |   17 Jun 2022 7:30 AM GMT
పోలీసుల్ని కుక్కల్లా వాడుకోవటం మగతనం కాదు!
X
ఎవరినైనా ఏమైనా అనేయొచ్చన్నట్లుగా మారింది ఇప్పటి రాజకీయం. పరస్పర మర్యాదలు మర్చిపోయి చాలా కాలమే అయ్యింది. రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగత విరోధులుగా మారటమే కాదు.. వారిని విమర్శించే క్రమంలో ఎంత మాటకైనా సిద్ధమన్నట్లుగా మాటలు అనేస్తున్న తీరు ఇప్పుడు మామూలుగా మారింది.

తన ఘాటు వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉండే తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధినేత్రి షర్మిల.. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ ను టార్గెట్ చేశారు.

ప్రస్తుతం ఆమె చేస్తున్న పాదయాత్ర ఖమ్మం పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ మంత్రి అజయ్ మీద మాటలతో గురి పెట్టారు. వెనుకా ముందు చూసుకోకుండా వ్యాఖ్యలు చేసిన ఆమె.. ఘాటు ఆరోపణలు చేశారు. ఇటీవల కాలంలో ఒక మంత్రి మీద ఇలాంటి వ్యాఖ్యలు ఎవరి మీదా చేసింది లేదు. ఖమ్మంలో రౌడీ రాజ్యం నడుస్తోందన్నారు.

మంత్రి పువ్వాడ అజయ్ వేధింపులు తట్టుకోలేక ఒక యువకుడు సూసైడ్ చేసుకున్నాడన్న ఆమె.. ఆయన తీరును తూర్పార పట్టారు. 'అజయ్ లో నిలకడ లేదు.

మొదట సీపీఎం.. తర్వాత వైసీపీ.. ఆ తర్వాత కాంగ్రెస్.. ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కావటంతో మంత్రి పదవి దక్కించుకున్నారు. పువ్వాడ ఎన్ని ఆస్తులు సంపాదించినా.. కబ్జాలు చేసినా ధన దాహం తీరట్లేదు' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు షర్మిల. 'ఖబడ్డార్ పువ్వాడ. పోలీసుల్ని పనోళ్ల మాదిరి.. కుక్కల మాదిరి వాడుకోవటం మగతనం కాదు. ఒక రౌడీ షీటర్ మాదిరి వ్యవహరించటం గొప్పతనం కాదు. ప్రజలు ఇచ్చిన పదవితో ప్రజలకు మేలు చేయాలి. హుందాగా వ్యవహరించాలి' అంటూ ఆమె వ్యాఖ్యలిప్పుడు సంచలనంగా మారాయి.