Begin typing your search above and press return to search.

అండా జైలులో ఉంచారు.. కంటిచూపు మందగించి.. 10 కిలోల బరువు తగ్గిన నేత

By:  Tupaki Desk   |   19 Nov 2022 11:30 PM GMT
అండా జైలులో ఉంచారు.. కంటిచూపు మందగించి.. 10 కిలోల బరువు తగ్గిన నేత
X
కాలం తిరగబడడం అంటే ఇదే.. మొన్నటివరకు ఆయన ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధినేతను శాసించిన వ్యక్తి. పార్టీకి అనధికార అధ్యక్షుడు. కానీ, ఆర్నెల్లలో అంతా మారిపోయింది. అధికారం పోయింది.. పార్టీ చీలిపోయింది.. అన్నిటికీ మించి ఆయనే జైలు పాలయ్యారు. కొన్ని నెలల పాటు జైలులో ఉండి ఇటీవల బతుకు జీవుగా అంటూ బయటపడ్డారు. ఆయనే శివసేన ఎంపీ సంజయ్ రౌత్.

ఆయనే అసలైన రైతు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే సారథ్యంలోని శివసేనకు అసలు రౌతు సంజయ్ రౌతే. ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నాకు ఎడిటర్ ఆయనే. మహారాష్ట్రలో ఉద్ధవ్ సీఎంగా శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రౌత్ గొంతు బలంగా వినిపించేవారు. సామ్నా పత్రికలో ప్రధాని మోదీ, బీజేపీపై ఒంటికాలు మీద లేచేవారు. అలాంటి రౌత్ ను మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేసి జైలులో పెట్టారు. అయితే, వంద రోజుల తర్వాత ఆయనకు ఈ నెల 9న బెయిల్ వచ్చింది. రౌత్ పై ఎలాంటి కారణం లేకున్నా.. అరెస్టు చేయడం పట్ల కోర్టు ఈడీని తప్పుబట్టింది.

అండా జైలులో ఉంచారట.. తనను తాను యుద్ధ ఖైదీగా అభివర్ణించుకుంటూ.. శుక్రవారం రౌత్ మీడియాతో మాట్లాడారు. తాను జైలులో ఉండడంతో 10 కిలోల బరువు తగ్గానని, జైలు ఫ్లడ్ లైట్ల కారణంగా కంటి చూపు మందగించిందని తెలిపారు. బీజేపీకి లొంగిపోయి ఉంటే, లేదా మౌన ప్రేక్షకుడిలా ఉంటే తనను ఏమీ చేయకపోయేవారని తెలిపారు.

తనను అండా (ఇరుకుగా ఉండే చిన్న జైలు) జైలులో ఉంచారని వాపోయారు. 15 రోజులు "అండా" జైలులో ఉంచడంతో కనీసం సూర్య కాంతిని కూడా చూడలేదని చెప్పుకొచ్చారు. జైలు ఫ్లడ్ లైట్ల కాంతి కారణంగా కంటిచూపు దెబ్బతిన్నదని.. కనీసం చదవడానికి, చూడడానికి ఇబ్బందిగా ఉందని వివరించారు. సంభాషణల్లో, కొంచెం వినేందుకూ ఇబ్బంది కలుగుతోందని చెప్పారు.

మాజీ హోం మంత్రి ఆరోగ్యం సరిగాలేదు మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ సైతం ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదని రౌత్ చెప్పారు. ప్రతిపక్ష నేతలను మాత్రమే ప్రభుత్వం
అరెస్టు చేస్తుందా? అని ప్రశ్నించారు. కాగా, కష్ట కాలంలో తనకు అండగా నిలిచిని థాక్రే కుటుంబానికి రౌత్ ధన్యవాదాలు తెలిపారు. మహారాష్ట్రలో ఉన్నది ఒక్కటే శివసేన అని.. అది ఉద్ధవ్ థాక్రే శివసేన అని వివరించారు. గత నెలలో జరిగిన అంథేరీ తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేసి ఉంటే శివ సేన (ఉద్ధవ్) లక్ష ఓట్ల తో గెలిచేదని చెప్పుకొచ్చారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.