Begin typing your search above and press return to search.

పౌరుషాల పురిటిగడ్డలో గులాబీ కారుకు షాకుల మీద షాకులు

By:  Tupaki Desk   |   16 Sep 2022 2:30 PM GMT
పౌరుషాల పురిటిగడ్డలో గులాబీ కారుకు షాకుల మీద షాకులు
X
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారే కాలానికి తగ్గట్లు కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే గులాబీ పార్టీలోనూ నెలకొంది. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు ముందు నుంచి గులాబీ పార్టీకి కాస్తంత పట్టు ఉన్న జిల్లాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒకటి. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఈ జిల్లా టీఆర్ఎస్ కు కంచుకోటలా మారింది. 2018 చివర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ అధిక్యతను ప్రదర్శించిన విషయం తెలిసిందే.

తాజాగా ఉన్న బలాన్ని చూసినప్పుడు వరంగల్ ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాల అభ్యర్థులతో పాటు పదకొండు అసెంబ్లీలకు గులాబీపార్టీ అధీనంలోనే ఉన్నాయి. ఇవే కాక.. ఎనిమిది ఎమ్మెల్సీలు.. ఆరు జిల్లా పరిషత్ లను సొంతం చేసుకొని.. మిగిలిన రాజకీయ పార్టీలకు ఏ మాత్రం అందనంత అధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇలాంటి వేళ.. కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో చోటు చేసుకున్ పరిణామాలు.. అధికార పార్టీలో నెలకొన్న అధిపత్య పోరు.. వెరసి గులాబీ పార్టీ మీద వ్యతిరేకత మొదలై.. కాంగ్రెస్ పార్టీకి అధిక్యత అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

మొత్తం 12 అసెంబ్లీ స్థానాల్లో 11 స్థానాల్లో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా.. వీటిల్లో ఇప్పుడు ఆరేడు స్థానాల్లో విపక్ష కాంగ్రెస్ బలపడిందన్న సర్వే రిపోర్టులు గులాబీ పార్టీకి ఇబ్బందికరంగా మారినట్లు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఉమ్మడి జిల్లాలోని ఆరేడు స్థానాలు విపక్షాలకు వెళ్లిపోవటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. దీంతో.. సిట్టింగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎన్నికల్లో గెలుపు మీద ఫోకస్ పెట్టిన గులాబీ బాస్ కు.. గెలుపే అంతిమ లక్ష్యమైనప్పుడు.. సిట్టింగుల విషయంలో ఆయన కరకుగా వ్యవహరించటానికే ఎక్కువ అవకాశం ఉందన్న మాట విషయం వినిపిస్తోంది.

ఈ మధ్యన నిర్వహించిన సమావేశాల్లోనూ గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తామని స్పష్టం చేసిన కేసీఆర్ మాటల్ని గుర్తు తెచ్చుకుంటున్న అధికార పార్టీ నేతలు ఇప్పుడు కన్ను మీద కనుకు రాని పరిస్థితి. ఇటీవల కాలంలో జరిపిన అన్ని సర్వేల్లోనూ అధికార పార్టీకి వ్యతిరేకంగానే ఆరేడు స్థానాల ఫలితాలు వస్తాయన్న విషయాన్ని సర్వేలు స్పష్టం చేస్తున్న వేళ.. ఉమ్మడి వరంగల్ జిల్లాపై అటు అధికారపార్టీలోనే కాదు.. సిట్టింగుల్లోనూ టెన్షన్ మొదలైనట్లుగా చెబుతున్నారు.

రోజులు గడిచే కొద్దీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ అంతకంతకూ బలపడుతోందన్న మాట వినిపిస్తోంది. పలువురు నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లుగా వస్తున్న ప్రకటనలు ఇప్పుడు చర్చగా మారుతున్నాయి. మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేల్లో.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. వరంగల్ పశ్చిమలో దాస్యం వినయ్ భాస్కర్ (చీప్ విప్)..వర్దన్నపేటలో ఆరూరి రమేశ్.. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మినహా మిగిలిన వారి పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్నట్లుగా సర్వే రిపోర్టులు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సర్వేల్లో ఆదరణ కోల్పోయినట్లుగా ప్రచారం జరుగుతున్న సిట్టింగులు ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకుండా.. పలు కార్యక్రమాల్ని చేపడుతున్నారు. రానున్న కొద్ది నెలల్లో తమ గ్రాఫ్ ను మెరుగుపరుచుకోవాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. పలువురు మాజీలను కొత్తగా బరిలోకి దింపే ఆలోచన గులాబీ బాస్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో.. పోటీ మరింత పెరిగి.. ఎవరికి వారు తామే తగిన అభ్యర్థి అన్న భావన కలిగేలా ప్రయత్నిస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.