Begin typing your search above and press return to search.

పార్టీలకు షాక్.. ఈసీ తాజా నిర్ణయంతో ఉక్కిరిబిక్కిరి

By:  Tupaki Desk   |   23 Jan 2022 5:01 AM GMT
పార్టీలకు షాక్.. ఈసీ తాజా నిర్ణయంతో ఉక్కిరిబిక్కిరి
X
ఓపక్క కరోనా మూడో వేవ్ దేశాన్నిఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. మరోవైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్న పార్టీల మాటకు తగ్గట్లే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. కరోనా కేసుల తీవ్రత కారణంగా పలు నియంత్రణల్ని జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తీసుకున్న నిర్ణయం మరింత షాకింగ్ గా మారిందని చెబుతున్నారు. కొవిడ్ కారణంగా ప్రత్యక్ష బహిరంగ సభలు.. రోడ్ షోల నిర్వహణపై నిషేధాన్ని జనవరి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇది రాజకీయ పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల వేళ.. తమ వాదనల్నివినిపించుకోవటానికి రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడటానికి వీలుగా బహిరంగ సభల్ని నిర్వహించటం.. భారీగా ప్రచారాన్ని చేపట్టటం తెలిసిందే. అందుకు భిన్నంగా ఇప్పుడు పలు పరిమితుల మధ్య ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ తో పాటు.. ఉత్తరాఖండ్.. పంజాబ్.. గోవా.. మణిపూర్ అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల షెడ్యూల్ ను జనవరి 8న విడుదల చేయటం తెలిసిందే.

ఆ సందర్భంగా ఎన్నికల ప్రచారంపై పరిమితుల్ని విధించిన కేంద్ర ఎన్నికల సంఘం.. జనవరి 15 వరకు రోడ్ షోలు.. బహిరంగ సభల నిర్వహణపై జనవరి 15 వరకు తొలుత నిషేధాన్ని విధించింది. అనంతరం కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆ బ్యాన్ ను జనవరి 22 వరకు పొడిగించింది. తాజాగా దాన్ని 31 వరకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం రాజకీయ పార్టీలకు షాకింగ్ గా మారుతుందన్న మాట వినిపిస్తోంది.

ఎక్కడైనా కల్యాణ మండపాలు.. సమావేశ మందిరాల్లో గరిష్ఠంగా 300 మందితోనూ లేదంటే.. సదరు హాల్ సామర్థ్యంలో 50 శాతం సీటింగ్ కెపాసిటీతోనే మీటింగ్ లు నిర్వహించుకోవచ్చని ఈసీ పేర్కొంది. తాజాగా నిర్ణయం నేపథ్యంలో దాదాపుగా ఎన్నికల ప్రచారాన్ని భారీ ఎత్తున నిర్వహించుకునే వీల్లేదనే చెప్పాలి. ఎందుకంటే.. ఫిబ్రవరి 10 నుంచి పోలింగ్ మొదలు కానుంది.

ఇప్పుడున్న పరిస్థితుల్ని చూస్తే.. ఫిబ్రవరి రెండో వారం వరకు కరోనా మూడో దశ తీవ్రంగా ఉండటమే కాదు.. కేసుల నమోదు కూడా భారీగా పెరుగుతాయని చెబుతున్నారు. దీంతో.. భారీ ఎత్తున ప్రచారం నిర్వహించకుండానే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఫిబ్రవరి 10 నుంచి మారచి 7 వరకు ఎన్నికల పోలింగ్ ను వివిధ దశల్లో నిర్వహిస్తున్నారు. యూపీలో దాదాపు ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తుంటే.. మణిపూర్ లో రెండు దశల్లో మిగిలిన మూడు రాష్ట్రాల్లో మాత్రం ఒక దశలోనే ఎన్నికల పోలింగ్ ను పూర్తి చేయనున్నారు.