Begin typing your search above and press return to search.

వైఎస్సార్సీపీ నేత‌ల‌తో క‌లిసి బ్యాంకాక్ లో ఎస్ఐ, డిప్యూటీ త‌హ‌సీల్దార్ ఎంజాయ్!

By:  Tupaki Desk   |   16 July 2022 8:30 AM GMT
వైఎస్సార్సీపీ నేత‌ల‌తో క‌లిసి బ్యాంకాక్ లో ఎస్ఐ, డిప్యూటీ త‌హ‌సీల్దార్ ఎంజాయ్!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పోలీసులు అధికార పార్టీ వైఎస్సార్సీపీ నేత‌లు చెప్పిన‌ట్టు న‌డుచుకుంటున్నార‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు, ప్ర‌తిప‌క్ష నేత‌లు ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అధికార పార్టీ నేత‌ల అడుగుల‌కు మ‌డుగులొత్తుతూ త‌మ‌పై త‌ప్పుడు కేసులు బ‌నాయించ‌డం, జైలుపాలు చేయ‌డం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

తాము అధికారంలోకి వ‌చ్చాక హ‌ద్దు మీరి ప్ర‌వ‌ర్తిస్తున్న పోలీసు అధికారుల‌కు శిక్ష త‌ప్ప‌ద‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌తిప‌క్షాలు ఆరోపించిన‌ట్టే కొంత‌మంది పోలీసు అధికారుల వ్య‌వ‌హార శైలి ఉంటోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. పోలీసుల‌మ‌న్న సంగ‌తిని మ‌ర్చిపోయి వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌ల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్పుకుంటున్నారు.

కాగా ఇదే కోవ‌లో ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి ఎస్ఐ (స‌బ్ ఇన్స్పెక్ట‌ర్) ఎస్ఐ ఎ.చంద్రశేఖర్‌, అక్కడి డిప్యూటీ తహసీల్దార్‌ ఎ.రవిశంకర్‌ అధికార వైఎస్సార్సీపీ పార్టీ నాయకులతో కలిసి థాయ్ లాండ్ రాజ‌ధాని బ్యాంకాక్‌ విహార యాత్ర‌కు వెళ్లార‌ని ప‌లు ప‌త్రిక‌లు వార్తలు ప్ర‌చురించాయి. దీంతో ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది. మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాలు అధికార పార్టీ నాయకుల‌తో పోలీసుల ములాఖ‌త్ అని తాము చెప్పింది నిజ‌మైంద‌ని గుర్తు చేస్తున్నారు.

కాగా ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్‌, దర్శి నగర పంచాయతీ కౌన్సిలర్‌, కొంతమంది సర్పంచులు, రేషన్‌ డీలర్లు తదితర 20 మందితో కలిసి ద‌ర్శి ఎస్ఐ చంద్ర‌శేఖ‌ర్, డిప్యూటీ త‌హ‌సీల్దార్ ర‌విశంక‌ర్ బ్యాంకాక్ పర్యటన చేయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింద‌ని అంటున్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం తనకు సెలవు కావాలంటూ అధికారులకు నివేదించిన ఎస్ఐ చంద్ర‌శేఖ‌ర్ బ్యాంకాక్‌కు వెళ్లినట్లు వార్త‌లు వ‌చ్చాయి.

ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు పోలీస్‌శాఖలో తీవ్ర‌ చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్ర‌కాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ స్పందించారు. ఎస్ఐ చంద్ర‌శేఖ‌ర్ బ్యాంకాక్ పర్యటన అంశం తమ దృష్టికి వచ్చిందని.. శాఖాపరమైన దర్యాప్తు చేస్తున్నట్లు తెల‌ప‌డం గ‌మ‌నార్హం.

పోలీసు శాఖలో అధికారుల అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లేందుకు నిబంధనలు అనుమతించవ‌ని ఎస్పీ చెబుతున్నారు. విచారణ జరిపి ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్ల‌డించారు.