Begin typing your search above and press return to search.

మోడీకి దక్షిణాది దెబ్బ రుచి చూపిద్దాం!

By:  Tupaki Desk   |   23 March 2018 11:21 AM GMT
మోడీకి దక్షిణాది దెబ్బ రుచి చూపిద్దాం!
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి వ్య‌తిరేకంగా కొత్త‌గా మ‌రో వాదం తెర‌మీద‌కు వ‌చ్చింది. దేశంలో మరోసారి ఉత్తరాది, దక్షిణాది వాదం క్రమంగా బలపడుతున్నది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్రభుత్వం కావాలనే దక్షిణాది రాష్ర్టాలను నిర్లక్ష్యం చేస్తున్నదన్న విమర్శలు ఎక్కువవుతున్న వేళ తాజాగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌ధాని మోడీకి దక్షిణాది దెబ్బ రుచిని చూపిద్దామంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు తెలంగాణ - ఏపీ - తమిళనాడు - మహారాష్ట్ర - పుదుచ్చెరి - కేరళ రాష్ర్టాల సీఎంలకు ట్విట్టర్ ద్వారా ఓ సందేశాన్ని పంపించారు.

15వ ఆర్థిక సంఘానికి కేంద్రం ఇచ్చిన సిఫారసులను దక్షిణాది రాష్ర్టాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 1971 తర్వాత దక్షిణాది రాష్ర్టాలు జనాభా పెరుగుదలను నియంత్రించగా...ఉత్తరాదిలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించలేదు. ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో దక్షిణాదిని పట్టించుకోవడం లేదని తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఫిర్యాదు చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఇక సిద్దరామయ్య అయితే ఉత్తరాదిని పోషిస్తోంది దక్షిణాదే అని ఈ మధ్యే వ్యాఖ్యానించారు. దీనికి కొన‌సాగింపుగా తాజాగా ఆయ‌న ఓ ఆస‌క్తిక‌ర పిలుపు ఇచ్చారు.

15వ ఆర్థిక సంఘం నిధుల పంపిణీకి 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకునేందుకు సిద్ధ‌మ‌యింది. దీన్ని సిద్దరామయ్య తీవ్రంగా తప్పుబడుతున్నారు. `ఇప్పటివరకు 1971 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకునే వారు. అదే జరిగితే 1971 తర్వాత విపరీతంగా జనాభా పెరిగిన యూపీ - బీహార్ - జార్ఖండ్‌ లాంటి ఉత్తరాది రాష్ర్టాలకు అధిక లబ్ధి చేకూరుతుంది. ఇది కచ్చితంగా దక్షిణాదిని దెబ్బతీస్తుందని, దీనిని అందరం కలిసి ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది` అని సిద్దరామయ్య స్పష్టం చేశారు. తన ట్వీట్‌లో ఆరు రాష్ర్టాల సీఎంల ట్విట్టర్ హ్యాండిల్స్‌ ను ట్యాగ్ చేశారు. సీఎంలతోపాటు డీఎంకే నేత స్టాలిన్ - కాంగ్రెస్ నేత శశి థరూర్‌ లను కూడా ట్యాగ్ చేయడం గమనార్హం.