Begin typing your search above and press return to search.

'సొసైటల్ జీరో' పేరుతో షాంఘైలో షాకిస్తున్న సైలెంట్ పీరియడ్

By:  Tupaki Desk   |   12 May 2022 3:05 AM GMT
సొసైటల్ జీరో పేరుతో షాంఘైలో షాకిస్తున్న సైలెంట్ పీరియడ్
X
కరోనా పుట్టిల్లు అయిన చైనాకు.. దాన్ని ఎలా ఎదుర్కొవాలనే విషయం మీద మిగిలిన ప్రపంచానికి భిన్నమైన రీతిలో అడుగులు వేస్తోంది. సొసైటల్ జీరో పేరుతో.. కరోనా కేసులు జీరో చేసేయాలన్న విషయంలో చైనా ప్రదర్శిస్తున్న పట్టుదల అంతా ఇంతా కాదు. డ్రాగన్ దేశ ఆర్థిక రాజధాని నగరంగా చెప్పే షాంఘైలో కరోనా కేసులు పెరగటం.. వాటిని కఠినంగా అణిచివేసేందుకు అమలు చేస్తున్న కఠిన ఆంక్షలు.. చైనీయులకు చుక్కలు చూపిస్తున్నాయి.

తాను నమ్మిన సిద్దాంతాన్ని ఏమైనా అమలు చేసే చైనా పాలకులు.. కరోనా విషయంలోనే అంతే కఠినంగా ఉన్నారు. దీంతో.. రోజుల తరబడి ఇంట్లోనే ఉండాల్సి రావటం.. అది కూడా దూరం దూరంగా ఉండాల్సి రావటం.. ఏ మాత్రం దగ్గరగా ఉన్నా గుర్తించేందుకు వీలుగా డ్రోన్ల పహరాతో చుక్కలు కనిపిస్తున్నాయి.

షాంఘై మహానగరంలో కొన్నిచోట్ల ఉన్న ప్రజలను ఆహారం కొనేందుకు.. ఆసుపత్రికి వెళ్లేందుకు కూడా వీధుల్లోకి వచ్చేందుకు అనుమతులు నిరాకరిస్తున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఆహార సరఫరా కూడా నిలిపివేయాలని నిర్ణయించారు. ఆసుపత్రుల్లో కూడా అత్యవసర సేవలకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. కరోనా సోకిన వారిని మాత్రమే కాదు.. వారి ఇరుగుపొరుగు వారి ప్రాణాలకు ఇప్పుడు పరీక్షలా మారాయి అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆంక్షలు.

కరోనా పాజిటివ్ వచ్చిన వారి ఇరుగుపొరుగున ఉన్న వారిని సైతం ప్రభుత్వం నిర్వహిస్తున్న క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎంతలా ప్రయత్నిస్తున్నా.. కరోనా కేసుల్ని తగ్గుముఖం పట్టేలా చేయగలుగుతున్న అధికారులకు.. ప్రభుత్వ లక్ష్యమైన సొసైటల్ జీరోను మాత్రం అందుకోలేకపోతున్నారు. అంతేకాదు.. షాంఘైలో సైలెంట్ పీరియడ్ పేరుతో కఠిన ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. ఇందులో బాగంగా మూడు రోజుల పాటు ఈ విధానాన్ని అమలు చేస్తారు.

ఇంతకీ సైలెంట్ పీరియడ్ అంటే ఏమిటంటే.. కేవలం ఆహారపదార్థాల సరఫరాకు మాత్రమే అనుమతిస్తారు. స్థానికులు ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రాకూడదు. ఎవరైనా ఎవరైనా అత్యవసర వైద్య సేవలకు ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తే.. ముందుస్తు అనుమతులు తెచ్చుకునే వారిని మాత్రమే వీధుల్లోకి వచ్చేందుకు అనుమతి ఇస్తారు.

కరోనా బారిన పడిన ఇంటికి చుట్టుపక్కల ఉన్న వారిని సైతం క్వారంటైన్ కు తరలించే క్రమంలో.. వారి ఇంటిని డిస్ ఇన్పెక్ట్ చేయటానికి ఇంటి తాళాల్ని మొయిన్ డోర్ వద్ద ఉంచాలని అధికారులు చెబుతున్నారు. ఈ నిర్ణయాలపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. ఆ విషయంలో బయటపడే సాహసాన్ని మాత్రం చేయట్లేదు.