Begin typing your search above and press return to search.

బాబును వ్య‌తిరేకించే వారికే..అధ్య‌క్ష పీఠం!

By:  Tupaki Desk   |   4 Jan 2018 10:33 AM GMT
బాబును వ్య‌తిరేకించే వారికే..అధ్య‌క్ష పీఠం!
X

సుదీర్ఘ‌కాలంగా చ‌ర్చ‌ల‌కే ప‌రిమిత‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ ర‌థ‌సార‌థి ప్ర‌క్రియ తుది ద‌శ‌కు చేరిన‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం రాష్ట్ర పార్టీ నేత‌ల‌కు స‌మాచారం చేర‌వేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. పార్టీ సీనియ‌ర్లు - మిత్ర‌పక్షంతో స‌ఖ్య‌త‌తో ఉండేవాళ్లు...టీడీపీని గ‌ట్టిగా ఎదుర్కునే నేతలు - పార్టీని బ‌లోపేతం చేయ‌గ‌లిగే సామ‌ర్థ్య‌మున్న‌ నాయ‌కులు...ఇలా ప‌లుర‌కాలా వ‌డ‌పోత‌ల అనంత‌రం ఈ ప్ర‌క్రియ ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇందులో ప్ర‌ధానంగా ఇటీవ‌ల మారిన స‌మీక‌ర‌ణాల ప్ర‌కారం...టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుపై దూకుడుగా స్పందించే నేత‌ల్లో ఒక‌రికి ప‌ద‌వి ద‌క్క‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ సోము వీర్రాజు - మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణలలో ఒకరిని అధ్యక్ష పదవి వరించడం ఖాయమ‌ని అంటున్నారు.

ఏపీ రాజ‌కీయాల‌ను గ‌మ‌నించిన వారి మాట ప్ర‌కారం రాష్ట్ర బీజేపీ ముఖ్య‌నాయ‌కుల్లో రెండుగా చీలిక ఉందని అంటున్నారు. టీడీపీ అనుకూల - వ్యతిరేక వర్గాలుగా చీలిపోయిన గ్రూపులు... అంతర్గత ఆదిపత్యపోరులో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు - మంత్రి కామినేని శ్రీ‌నివాస్‌ టీడీపీ అనుకూల వర్గంగా చెప్తున్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు - మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ - కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి వంటివారు వ్యతిరేక వ‌ర్గ‌మ‌ని విశ్లేషిస్తున్నారు. ఈ నేత‌లు అవకాశం చిక్కినప్పుడల్లా టీడీపీని టార్గెట్ చేసి.. విమర్శలు గుప్పించడంలో ముందుంటుండ‌టం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని వివ‌రిస్తున్నారు. కాగా, ఏపీలో పార్టీని బలోపేతం చేయ‌డంపై దృష్టిపెట్టిన బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం ఈ క్ర‌మంలో జ‌న‌వ‌రి నెలాఖరుకల్లా కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపిన‌ట్లు స‌మాచారం. అదిష్టానం నూత‌న ర‌థ‌సారథుల విష‌యంలో క్లారిటీ ఇవ్వ‌డంతో ఇటీవ‌లి ప‌రిణామాల ప్ర‌కారం సోము వీర్రాజు - కన్నా లక్ష్మీనారాయణలకు చాన్స్ ఉంటుంద‌ని అంటున్నారు.

టీడీపీ అధ్య‌క్షుడు - ఏపీ సీఎం చంద్ర‌బాబును తీవ్రంగా వ్యతిరేకించే వారిలో ఈ ఇద్ద‌రు బీజేపీ నేత‌లు ముందువరసలో నిలుస్తారు. వీరిలో ఒకరిని అధ్యక్షుడుగా నియమిస్తే మిత్రపక్షమైన టీడీపీ ఎలా స్పందిస్తుందోనన్నది ఆసక్తికర అంశంగా మారింది. ఇప్పటికే టీడీపీ అధినేతకు.. బీజేపీ అగ్రనాయకత్వానికి కొంత దూరం పెరిగింది. టీడీపీని వ్యతిరేకించేవారు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులయితే ఆ దూరం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో టీడీపీకి అనుకూల వర్గంగా పేరు పొందిన వారి పరిస్ధితి ఏమిటనేది కూడా ఆసక్తికరంగా మారింది.

మరోవైపు.. కొత్త కార్యవర్గం ఏర్పడినా - ఏర్పడకపోయినా.. రాష్ట్ర బీజేపీలోని రెండు గ్రూపులు కలిసి పనిచేసే పరిస్ధితులు కనిపించడంలేదని.. ఆ పార్టీ నాయకులు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. పైకి మాత్రం బీజేపీలో ఎటువంటి గ్రూపులు లేవని - ఎవరు ఎలా మాట్లాడినా చివరికి అంతిమ లక్ష్యం రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమేనని చెప్తున్నారు.