Begin typing your search above and press return to search.

టీచర్ కాదు పిశాచి.. క్లాస్ రూంలో కత్తెరతో పొడిచి.. బాల్కనీ నుంచి తోసేసింది

By:  Tupaki Desk   |   17 Dec 2022 10:32 AM GMT
టీచర్ కాదు పిశాచి.. క్లాస్ రూంలో కత్తెరతో పొడిచి.. బాల్కనీ నుంచి తోసేసింది
X
గురువు దైవంతో సమానం అని చెప్పేవారు. మారిన కాలానికి తగ్గట్లుగా గురువు స్థానం మారిపోతున్న సంగతి తెలిసిందే. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పటం.. వారిని సరైన మార్గంలో నడిచేలా చేసే గురువుల స్థానం నుంచి గంటల చొప్పున ఫీజులు వసూలు చేసే వరకు వెళ్లింది. ఇప్పుడున్నదంతా వాణిజ్య ప్రపంచమే కాబట్టి.. దాని గురించి ఎక్కువ చింతించాల్సిన అవసరం లేదు. డబ్బులు తీసుకుంటే తీసుకున్నారు. కానీ.. అందుకు తగ్గట్లుగా వారి తీరు ఉండాలి కదా? తాజాగా ఒక టీచర్ చేసిన దారుణమైన పని గురించి తెలిస్తే.. ఆమెను సైకో టీచర్ అని కానీ పిశాచి పంతులమ్మ అని కానీ పిలవాలే తప్పించి మరో మాట అనేందుకు కూడా ఆలోచన రాదు.

దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ దారుణ ఉదంతం విన్నవారంతా షాక్ తింటున్నారు. ఇలాంటి టీచర్ కూడా ఉంటుందా? అని విస్మయానికి గురవుతున్నారు. అసలు అలాలెలా చేస్తారన్నట్లుగా సదరు టీచర్ తీరు ఉందని చెప్పాలి. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని మొదటి అంతస్తు నుంచి కిందకు తోసేసిన దారుణానికి పాల్పడింది ఒక టీచర్. స్కూల్ జరుగుతున్న వేళ.. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఉదంతంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధీనంలో పని చేసే నగర్ నిగమ్ బాలికా విద్యాలయంలో గీతా దేశ్వాల్ అనే టీచర్ పని చేస్తుంటారు. క్లాస్ విద్యార్థిని మీద కోపంతో కత్తెరతో పొడవటమే కాదు.. ఆమెను బాల్కనీ నుంచి కిందకు తోసేసింది. ఈ దారుణ ఉదంతాన్ని గుర్తించిన మరో టీచర్ రియా.. ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినకుండా విద్యార్థినిని క్లాస్ రూంలో నుంచి బాల్కనీ నుంచి కిందకు తోసేసింది. దీంతో.. సదరు చిన్నారి బాల్కనీ నుంచి కిందకు పడి తీవ్ర గాయాలపాలైంది. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఈ షాకింగ్ ఉదంతం చోటు చేసుకున్నంతనే స్కూల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. తాజా ఉదంతంపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్పందించింది. బాలిక వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం తామే భరిస్తామని పేర్కొంది.

అంతేకాదు.. ఈ దారుణానికి పాల్పడిన గీతా దేశ్వాల్ ను తక్షణం సస్పెండ్ చేశామని.. దీనిపై విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. సదరు సైకో టీచర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతటి పైశాచికంగా వ్యవహరించే టీచర్ ను ఊహించలేం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.