Begin typing your search above and press return to search.

అమరావతి భూబాగోతం.. షేక్ అవుతున్న టీడీపీ నేతలు

By:  Tupaki Desk   |   20 Dec 2019 8:09 AM GMT
అమరావతి భూబాగోతం.. షేక్ అవుతున్న టీడీపీ నేతలు
X
ఏపీ అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి బుగ్గన ఇటీవల అమరావతి భూకుంభకోణంపై చేసిన ప్రకటన టీడీపీ నేతలను షేక్ చేస్తోంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి తెప్పించి మరీ బుగ్గన టీడీపీ నేతల బినామీల గుట్టు విప్పడంతో ఇప్పుడు వారంతా కక్కలేక మింగలేక కుడిదిలో పడ్డ ఎలుకల వలే గిలాగిలా కొట్టుకుంటున్నారు.

తాజాగా గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబుకు రైట్ హ్యాండ్ గా వ్యవహరించిన నారాయణ, ధూళిపాళ్ల నరేంద్ర, పుట్టా సుధాకర్ యాదవ్, వేమూరి రవిలు విలేకరుల సమావేశం పెట్టి మరీ బుగ్గన చేసిన ఆరోపణలు అవాస్తవం అని మొసలికన్నీరు కార్చారు. ఎవరికి తాము బినామీలుకామని తేల్చిచెప్పారు.

అయితే చంద్రబాబు రాజధానిగా అమరావతిని చేయడానికి ముందే నారాయణ సహా టీడీపీ నేతలు తమ బినామీలు, మిత్రులతో కలిసి రియల్ ఎస్టేట్ సంస్థలు స్థాపించి పెద్ద ఎత్తున అమరావతి పరిధిలో భూములు కొన్నారని.. ఆ బినామీల లెక్కలను బుగ్గన విడమర్చి టీడీపీ నేతలను ఇరుకునపెట్టారు. ఒక్క నారాయణ బినామీలే 55 ఎకరాలు కొన్నారని చూపించారు. అయితే ఎక్కడా చట్టానికి దొరక్కకుండా వీరంతా చేశారని చెప్పారు.

రాజధాని ప్రకటనకు ముందు జరిగిన ఈ పందేరం గురించి టీడీపీ ప్రభుత్వ పెద్దలకు మాత్రమే తెలుసునని.. వాళ్లు బినామీలతో ఈ భూములు కొనిపించారని బుగ్గన ఆరోపించారు. బినామీలకు ఈ విషయం తెలియక కొనేశారని చెప్పారు. బుగ్గన చేసిన ప్రకటన తర్వాత ఇప్పుడు అందరూ అక్కడి టీడీపీ భూబకాసురల గురించి ఆరాతీసి షాకవుతున్నారు. స్వయంగా టీడీపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారట.. ఎంత కవర్ చేసుకుందామని చూసినా బినామీల భూబాగోతం ఇప్పుడు టీడీపీ నేతల మెడకు చుట్టుకుంటోందట..