Begin typing your search above and press return to search.

సిలిండ‌ర్ పేల్లేదు.. బాంబుదాడి జ‌రిగింద‌ట‌

By:  Tupaki Desk   |   9 July 2017 5:56 AM GMT
సిలిండ‌ర్ పేల్లేదు.. బాంబుదాడి జ‌రిగింద‌ట‌
X
అమ‌ర్ నాథ్ యాత్ర‌లో భాగంగా ఒక బ‌స్సులో పేలిన గ్యాస్ సిలిండ‌ర్ ఒక తెలుగు భ‌క్తుడు మ‌ర‌ణించ‌గా.. మ‌రికొంద‌రు తీవ్రంగా గాయ‌ప‌డిన ఉదంతం తెలిసిందే. అయితే.. దీనికి సంబంధించిన సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. సిలిండ‌ర్ పేలుడుతో ప్ర‌మాదం చోటు చేసుకోలేద‌ని.. త‌మ బ‌స్సుపై బాంబుదాడి జ‌రిగింద‌న్న విష‌యాన్ని బ‌స్సులోని ప్ర‌యాణికులు చెబుతున్నారు. జ‌మ్ముకాశ్మీర్ లోని అనంత‌నాగ్ వ‌ద్ద జ‌రిగిన పేలుడును.. గ్యాస్ సిలిండ‌ర్ పేలుడుగా ప్ర‌చారం చేశార‌ని.. ప్ర‌మాదాన్ని త‌క్కువ చేసి చూపించార‌ని.. అయితే.. భ‌యంతో తాము నోరు విప్ప‌లేద‌ని బాధితులు చెబుతున్నారు.

బ‌స్సులో సిలిండ‌ర్ పేలిన ఘ‌ట‌న గురించి వార్త‌లు వ‌చ్చిన వెంట‌నే తెలంగాణ ప్ర‌భుత్వం అలెర్ట్ అయ్యింది. ఆర్మూర్‌.. హైద‌రాబాద్‌.. కామారెడ్డిల‌కు చెందిన వారు ప్ర‌మాదంలో ఉన్నార‌ని తెలిసిన రాష్ట్ర స‌ర్కారు వెంట‌నే వారిని స్వ‌గ్రామాల‌కు తీసుకొచ్చే ప‌నిలో ప‌డింది. ఇందులో భాగంగా వారిని ఢిల్లీకి క్షేమంగా తీసుకొచ్చింది.

తెలుగు మీడియా బాధితుల్ని క‌లిసి.. అస‌లేం జ‌రిగింద‌న్న విష‌యాన్ని ఆరా తీసిన‌ప్పుడు సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ నెల 5న ద‌ర్శ‌నం చేసుకొని తిరిగి వ‌స్తున్న వేళ‌.. సాయంత్రం ఆరు గంట‌ల వేళ‌లో ఒక డాబా ద‌గ్గ‌ర బ‌స్సు ఆపామ‌ని.. ఆ త‌ర్వాత బ‌య‌లుదేరగా.. బ‌స్సుపై బాంబు దాడి జ‌రిగింద‌ని చెప్పారు. ఎందుకైనా మంచిద‌ని.. బాంబుదాడి జ‌రిగినా.. ఆప‌కుండా బ‌స్సును ముందుకు తీసుకొచ్చార‌ని.. ఆ త‌ర్వాత సైన్యం.. పోలీసులు సాయంగా వ‌చ్చి త‌మ‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లుగా బాధితులు చెబుతున్నారు. బ‌స్సులోని ప‌లువురికి బాంబు దాడి కార‌ణంగా గాయాల పాలైన‌ట్లు వెల్ల‌డించారు.

జ‌రిగింది బాంబుదాడి అయితే.. బ‌స్సులో సిలిండ‌ర్ పేలిన‌ట్లుగా ప్ర‌చారం చేశార‌ని.. అస‌లు విష‌యాన్ని బ‌య‌టకు రానివ్వ‌కుండా చేశార‌ని చెబుతున్నారు. ప్ర‌మాదాన్ని త‌క్కువ చేసే ప్ర‌య‌త్నం చేశార‌న్నారు. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన ప‌లువురి కోసం అనంత‌నాగ్ లోని ఆసుప‌త్రి వ‌ద్దే మ‌రికొంద‌రు ఉండిపోయిన‌ట్లుగా చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని రాష్ట్ర ప్ర‌భుత్వం త‌మ ఖ‌ర్చుల‌తోనే వారిని వారి.. వారి స్వ‌స్థ‌లాల‌కు పంపే ఏర్పాట్లు చేసింది.