Begin typing your search above and press return to search.

స్మృతీ ఇరానీకి షాకిచ్చిన స్టూడెంట్

By:  Tupaki Desk   |   7 Jun 2016 9:34 AM GMT
స్మృతీ ఇరానీకి షాకిచ్చిన స్టూడెంట్
X
విజయవాడలో పర్యటిస్తున్న కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీకి ఊహించని షాక్ తగిలింది. విజయవాడ ఓల్డ్ సిటీలోని గుజరాతీ విద్యాలయంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆమె వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులతో ముచ్చటించారు. ఆ సందర్భంగా ఒక విద్యార్థి ప్రత్యేక హోదాపై సూటి ప్రశ్న సంధించి ఇరానీని ఇరకాటంలో పడేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందా? రాదా?... అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా... దీనిపై క్లారిటీ ఎప్పుడిస్తారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. దాంతో స్మృతీ ఇరానీ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కొద్ది క్షణాలు పాటు మౌనం వహించారు. ఆ తరువాత తేరుకుని తెలివిగా తప్పించుకున్నారు. ఆ విషయం తన శాఖ పరిధిలోనిది కాదని.. అంతకంటే తానేమీ చెప్పలేనని అంటూ తప్పించుకున్నారు.

కాగా కేంద్ర మంత్రిని ఒక విద్యార్థి సూటిగా ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించడంపై ఏపీ బీజేపీ వర్గాలు ఒక్కసారిగా కలవరపడ్డాయి. టీడీపీ నేతల ప్రోద్బలంతోనే ఆ విద్యార్థి కేంద్ర మంత్రిని ప్రశ్నించినట్లు అనుమానిస్తున్నారు. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా కూడా విజయవాడకు చెందిన విద్యార్థి ప్రత్యేక హోదా గురించి స్పందించి కేంద్రమంత్రిని ప్రశ్నించడంపై టీడీపీ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇక్కడి ప్రజలు, విద్యార్థుల ఆకాంక్షకు ఈ సంఘటన నిదర్శనమని.. ఇప్పటికైనా కేంద్రం అర్థం చేసుకోవాలని అంటున్నారు.

అయితే... ప్రత్యేక హోదా ప్రశ్నలతో షాక్ తిన్న స్మృతి ఇరానీనకి ఆ తరువాత మాత్రం మంచి హుషారు వచ్చింది. అందుకు కారణం కొందరు విద్యార్థులు ఆమెను తెగ పొగడడమే. ఓ విద్యార్థిని మైక్ అందుకుని... ‘మీరు చాలా డైన‌మిక్, నేనూ మీలా ఓ డైన‌మిక్ మ‌హిళ‌ను కావాల‌నుకుంటున్నాను. నాకు మీరే స్ఫూర్తి.. మీలా ఎద‌గాలంటే ఏం చెయ్యాలి..?’ అని అడిగింది. దానికి స్మృతి ముసిముసి నవ్వులు నవ్వుతూ సమాధానమిచ్చారు. సొంత కుటుంబంలోని వ్య‌క్తుల‌ను - టీచ‌ర్ల‌ను స్ఫూర్తిగా తీసుకొని రాణించాల‌ని ఆమె సూచించారు. మొత్తానికి విద్యార్థులతో ఇంటరాక్షన్ కేంద్రమంత్రి తీపిచేదులు రెండింటినీ పంచింది.