Begin typing your search above and press return to search.

సునంద పుష్కర్‌ ది హత్యే!

By:  Tupaki Desk   |   12 March 2018 1:22 PM GMT
సునంద పుష్కర్‌ ది హత్యే!
X
జాతీయ రాజ‌కీయాల‌ను కుదిపేసే మ‌రో ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చింది. కాంగ్రెస్ నేత - మాజీ కేంద్రమంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో మరో షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆమెది హత్యే అని ఓ సీక్రెట్ రిపోర్ట్ చెబుతోంది. ఈ రిపోర్ట్ ప్రతులను డీఎన్‌ఏ పత్రిక సంపాదించింది. అసలు ఆమెను ఎవరు చంపారన్న విషయం కూడా విచారణాధికారులకు ముందే తెలుసని, అయినా ఇప్పటివరకూ ఆమె మృతి కేసు మిస్టరీగానే ఉందని ఆ రిపోర్ట్ చెబుతోంది.

డీఎన్ ఏ క‌థ‌నం ప్ర‌కారం పుష్క‌ర్ కేసులో తొలి రిపోర్ట్ ఇచ్చిన అప్పటి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బీఎస్ జైస్వాల్.. సునంద పుష్కర్‌ ది ఆత్మహత్య కాదని తేల్చి చెప్పారు. ఈ ఘటన జరిగిన లీలా హోటల్‌ లోని రూమ్‌ ను వసంత్ విహార్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ అలోక్ శర్మ పరిశీలించి అతి ఆత్మహత్య కాదని చెప్పినట్లు ఆ రిపోర్ట్‌ లో స్పష్టంగా ఉంది. పోస్ట్‌ మార్టమ్ రిపోర్ట్‌ లోనూ ఆమెకు విషమిచ్చిన కారణంగానే చనిపోయిందని చెప్పడంతో సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ దీనిని హత్య కేసుగానే విచారణ చేపట్టాలని సరోజిని నగర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌ కు ఆదేశాలు జారీ చేశారు. ఆమె ఒంటిపై మొత్తం 15 గాయాలు ఉన్నాయి. అందులో పదో నంబర్ గాయం ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏర్పడినది. 12వ నంబర్ గాయం చూస్తే ఎవరో కొరికినట్లుగా ఉంది. ఆమె ఎవరితోనో గొడవ పడినట్లుగా ఒంటిపై గాయాలు ఉన్నాయి` అని ఆ రిపోర్ట్ స్పష్టంగా చెప్పింది.

భర్త శశి థరూర్‌ తో గొడవ పడినపుడే ఈ గాయాలు అయినట్లు వాళ్ల వ్యక్తిగత సహాయకుడు నారాయణ్ సింగ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం స్పష్టమవుతుంది అని ఆ రిపోర్ట్ పేర్కొంది. ఇదే రిపోర్ట్‌ ను ఆ తర్వాత హోంమంత్రిత్వ శాఖకు కూడా అప్పగించారు. అయితే ఆమె మృతికి కారణం తెలిసిన తర్వాత కూడా పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ కేసులో దక్షిణ ఢిల్లీ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వివేక్ గోగియా పాత్రపై అనుమానాలు ఉన్నాయి. ఈ కేసును వారం తర్వాత క్రైమ్‌బ్రాంచ్‌కు ట్రాన్స్‌ఫర్ చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబోతుండగా.. దానిని మళ్లీ వెనక్కి తీసుకొచ్చారు గోగియా. ఈ రహస్య నివేదికలో పోస్ట్‌ మార్టమ్ - కెమికల్ - బయోలాజికల్ ఫింగర్‌ ప్రింట్స్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా ఇది హత్యేనని తేల్చినా.. పోలీసులు మాత్రం కేసు పెట్టలేదు. అంతేకాదు ఆమె శరీరంలోకి ఇంజెక్షన్ ద్వారా విషం ఎక్కించారా లేక నోటి ద్వారానా అన్నదానిపై విచారణ జరపాలని కూడా ఈ రిపోర్ట్ స్పష్టంచేసింది. 2014, జనవరి 17న రాత్రి 9 గంటల సమయంలో సునంద పుష్కర్ చనిపోయినట్లు తెలుసుకున్న పోలీసులు.. హోటల్ లీలా ప్యాలెస్ రూమ్ 345కి వెళ్లి పరిశీలించారు. అదే రోజు మధ్యాహ్నం ఆమె మీడియాతో మాట్లాడాలని అనుకున్నది. కానీ రాత్రయ్యే సరికి శవమై కనిపించింది.