Begin typing your search above and press return to search.

కొలీజియం వ్యవస్థపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   9 Dec 2022 6:30 AM GMT
కొలీజియం వ్యవస్థపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
X
న్యాయమూర్తుల నియామకం, బదిలీకి సంబంధించిన కొలీజియం వ్యవస్థపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కొలీజియం వ్యవస్థ ఈ దేశం రూపొందించిన చట్టమని.. దాన్ని తప్పనిసరిగా పాటించాల్సిందేనని కేంద్రానికి తేల్చిచెప్పింది. ఇందులో మరో అభిప్రాయానికి తావు లేదని విస్పష్ట ప్రకటన చేసింది.

ఇటీవల న్యాయమూర్తుల నియామకం, బదిలీకి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం చేసిన పలు సిఫారసులను కేంద్రం ఆమోదించలేదు. అంతేకాకుండా కొలీజియం వ్యవస్థపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధనకడ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందులోనూ ఉపరాష్ట్రపతి ధనకడ్‌ అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ సమక్షంలోనే కొలీజియం వ్యవస్థను తప్పుబట్టారు.

ఈ నేపథ్యంలో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను ఆమోదించడంలో కేంద్రం జాప్యం చేస్తోందంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను తాజాగా న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓకా, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ల ధర్మాసనం విచారించింది.

ఈ సందర్భంగా, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో పనిచేస్తున్న వారు కొలీజియం వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడంపై సుప్రీం ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాంటి వారిని నియంత్రించాలని అటార్నీ జనరల్‌(ఏజీ) ఆర్‌.వెంకటరమణికి తెలిపింది.

''సుప్రీంకోర్టుకు న్యాయసమీక్ష అధికారం లేదని ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారే చెబుతున్నారు. రేపు రాజ్యాంగ మౌలిక స్వరూపం కూడా రాజ్యాంగంలో లేదని అంటారు. కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా నేతలు చేసిన వ్యాఖ్యలపై మాకు అభ్యంతరం ఉంది. నియంత్రణ పాటించాలని వారికి సలహా ఇవ్వండి'' అని ధర్మాసనం అటార్నీ జనరల్‌కు సూచించింది.

కొలీజియం.. రాజ్యాంగ ధర్మాసనం ఆమోదించిన వ్యవస్థ అని సుప్రీంకోర్టు పేర్కొంది. కొలీజియంకు వ్యతిరేకంగా కొందరు వ్యాఖ్యలు చేసినంత మాత్రాన అది చట్టం కాకుండా పోదని తెలిపింది. ప్రభుత్వాలు చేసిన చట్టాలను కూడా కొందరు వ్యతిరేకిస్తుంటారని గుర్తు చేసింది. అంతమాత్రం చేత వాటి అమలును నిలిపివేయాలా అని నిలదీసింది. ఏ చట్టాన్ని పాటించాలి? దేన్ని పాటించకూడదు అనేది వ్యక్తులకే వదిలేస్తే మొత్తం వ్యవస్థే కుప్పకూలుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా హెచ్చరించింది.

పునరుద్ఘాటించిన పేర్లనే రెండు సందర్భాల్లో కొలీజియం వెనక్కి తీసుకుందని, దీని ప్రకారం చూస్తే సుప్రీంకోర్టుకే స్పష్టత లేదన్న అనుమానాలు తలెత్తుతున్నాయని అటార్నీ జనరల్‌ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి అరుదైన సందర్భాలను ఆధారంగా చేసుకొని పునరుద్ఘాటించిన పేర్లను తప్పనిసరిగా ఆమోదించాలన్న ధర్మాసనం ఉత్తర్వులను విస్మరించే అధికారం ప్రభుత్వానికి లేదంది. ఇటీవల కేంద్రం కూడా 19 పేర్లను తిరిగి పంపిన విషయాన్ని గుర్తు చేసింది.

చట్టానికి సంబంధించి ఈ న్యాయస్థానమే తుది నిర్ణేత అని సుప్రీంకోర్టు తెలిపింది. చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నా అవన్నీ న్యాయస్థానాల సమీక్షకు లోబడి ఉండాల్సిందేనని పేర్కొంది. ఈ కోర్టు నిర్దేశించిన చట్టాలను అందరూ అనుసరించాలని ధర్మాసనం తేల్చిచెప్పింది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.