Begin typing your search above and press return to search.

బాబా స‌ర్‌.. మీ వైద్యం అన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందా: రాందేవ్‌కు సుప్రీం షాక్‌

By:  Tupaki Desk   |   23 Aug 2022 3:04 PM GMT
బాబా స‌ర్‌.. మీ వైద్యం అన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందా:  రాందేవ్‌కు సుప్రీం షాక్‌
X
యోగా ద్వారా.. ప్ర‌జ‌ల‌కు చేరువై... ప‌తంజ‌లి ఉత్ప‌త్తుల ద్వారా.. దేశ‌వ్యాప్తంగా భారీ వ్యాపారిగా ఎదిగిన గురువు రాందేవ్ బాబాపై సుప్రీంకోర్టు ఫైర్ అయింది. ఇంగ్లీష్ వైద్యం(అల్లోప‌తి)పై ఆయ‌న చేస్తున్న ప్ర‌చారాన్ని త‌ప్పుబ‌ట్టింది. బాబా చేస్తున్న యోగా వైద్యంతో అన్ని ర‌కాల వ్యాధులు న‌యం అవుతాయ‌నే గ్యారెంటీ ఉందా? అని కోర్టు నిల‌దీసింది.

అల్లోపతి వైద్యులు, ఔషధాలు, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా జరుగుతోన్న విస్తృత ప్రచారాలపై భారత వైద్య మండలి (ఐఎంఏ) సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. అల్లోపతిపై రాందేవ్‌ బాబా విమర్శలను ప్రస్తావించింది.

"అల్లోపతి వైద్యులపై రాందేవ్‌ బాబా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు. ఆయన యోగాకు ప్రాచుర్యం కల్పించారు మంచిదే..! కానీ, ఇతర వ్యవస్థలను ఆయన విమర్శించకూడదు. ఆయన అనుసరిస్తున్న విధానాలు అన్ని వ్యాధుల‌నూ నయం చేస్తాయన్న గ్యారెంటీ ఏంటీ?" అని జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ఐఎంఏ పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్రానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. గతేడాది కొవిడ్ రెండో దశ విజృంభణ సమయంలో అల్లోపతి వైద్యంపై రాందేవ్‌ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే.

'అల్లోపతి పనికిమాలిన వైద్యం' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో ఓ వీడియో అప్పట్లో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో భారత వైద్య మండలితో పాటు అప్పటి కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లోపతి వైద్య విధానాన్ని ఆయన కించపరుస్తున్నారంటూ వైద్య మండలి మండిపడింది.

ఇది కాస్తా తీవ్ర వివాదాస్పదం కావడంతో రాందేవ్‌ బాబా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. మరోవైపు, రాందేవ్‌కు వ్యతిరేకంగా పలు న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. త‌ప్పుడు ప్ర‌ట‌న‌ల ద్వారా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించినందునందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చ‌ర్య తీసుకొవాల‌ని, అత‌నిపై విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరింది.