Begin typing your search above and press return to search.

బ‌క్రీద్ కోసం ఆంక్ష‌లు స‌డ‌లింపు.. కేర‌ళ‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం !

By:  Tupaki Desk   |   20 July 2021 1:30 PM GMT
బ‌క్రీద్ కోసం ఆంక్ష‌లు స‌డ‌లింపు.. కేర‌ళ‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం  !
X
రేపు ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన రోజు, అదేమిటి అంటే బ‌క్రీద్ పండుగ‌. ఈ సంద‌ర్భంగా కేర‌ళ ప్ర‌భుత్వం లాక్‌ డౌన్ ఆంక్ష‌ల‌ను స‌డిలించింది. వ్యాపార‌స్తుల‌కు వెస‌లుబాటు క‌ల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఓ వైపు దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ జోరు కొనసాగుతుంది. అలాగే మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే .. దేశంలో ప్రస్తుతం నమోదు అయ్యే కరోనా మహమ్మారి పోసిటివ్ కేసుల్లో ఎక్కువ భాగం కేరళ రాష్ట్రంలోనే నమోదు అవుతున్నాయి. ఈ తరుణంలో బక్రీద్ పండుగ కోసం ఆంక్షలు సడలించడం పై సుప్రీం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ వ్యవహారం పై నేడు సుప్రీం లో విచారణ జరగగా .. కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా అనుచితమని , ప్ర‌భుత్వ వైఖ‌రిని అత్యున్న‌త న్యాయ‌స్థానం త‌ప్పుప‌ట్టింది, కేర‌ళ ప్ర‌భుత్వ వైఖ‌రి షాకింగ్‌కు గురిచేస్తోంద‌ని కోర్టు చెప్పింది. లాక్ డౌన్ ఆంక్ష‌ల‌ను ఎత్తివేయ‌డం వ‌ల్ల కొత్త‌గా ఏవైనా ఇన్ఫెక్ష‌న్లు పెరిగితే, అలాంటి ఘ‌ట‌న‌ల‌కు కోర్టు ముందుకు తీసుకువ‌స్తే, అప్పుడు కేర‌ళ‌ ప్రభుత్వం పై చ‌ర్యలు తీసుకుంటామ‌ని సుప్రీం వెల్ల‌డించింది. లాక్‌ డౌన్ ఆంక్షలను సడలించాలని వ్యాపారులు చేసిన డిమాండ్‌ కు కేరళ సర్కార్ తలొగ్గడం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని జస్టిస్ ఆర్ ఎఫ్ నారిమన్, బీఆర్ గవాయ్‌ లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

'పౌరుల జీవించే హక్కు చాలా విలువైనది. ఒత్తిళ్లకు తలవొగ్గి ప్రజల జీవించే హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తోసిరాజనడం కుదరదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనైనా తలెత్తి ఇబ్బంది కలిగితే ప్రజలు ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకురావాలి. అందుకు తగ్గట్టుగా మేం చర్యలు తీసుకుంటా అని ధర్మాసనం ఘాటుగా స్పందించింది. కన్వర్ యాత్ర కేసులో తాము ఇచ్చిన ఉత్తర్వులను అనుసరించాలని విజయన్ సర్కార్‌ ను ఆదేశించింది. కేరళ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పీకే నంబియార్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేరళ ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తూ.. సడలింపుల నిర్ణయాన్ని సమర్ధించుకుంది.

జూన్ 15 నుంచి ఆంక్షలు సడలింపులు కొనసాగుతున్నాయని, కొత్తగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. బక్రీద్ అమ్మకాల వల్ల తమ ఆర్థిక సమస్యలను తగ్గించుకుంటామని భావించిన వ్యాపారులకు కలిగే కష్టాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని తెలిపింది. పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ లాయర్ వికాస్ సింగ్.. సడలింపులకు ఈ రోజే చివరి రోజని, తక్షణమే ఉత్తర్వులు జారీచేయాలని కోరారు.

దీనికి జస్టిస్ట్ నారీమన్ స్పందిస్తూ..ఇక్కడ విషయం అది కాదు.. గుర్రం ఇప్పటికే రేసు చివరకు చేరుకుంది.. ఈ సమయంలో ఉత్తర్వులను నిలుపుదల చేయలేం అని అన్నారు. అంతకు ముందు రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతానికిపైగా ఉందని వికాస్ సింగ్ వివరించారు. మూడు రోజుల ఆంక్షల సడలింపుపై అఫిడ్‌విట్ దాఖలుచేయాలని విజయన్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. అటు, కేరళ ప్రభుత్వం సడలింపుల నిర్ణయాన్ని ఐసీఎంఆర్ తీవ్రంగా తప్పుబట్టింది. నిబంధనలు సడలించడం థర్డ్ వేవ్‌ను ఆహ్వానించడమేనని హెచ్చరించింది.