Begin typing your search above and press return to search.

రఫేల్ పై మోడీ సర్కారుకు ఊరట.. రాహుల్ పై సీరియస్

By:  Tupaki Desk   |   14 Nov 2019 8:38 AM GMT
రఫేల్ పై మోడీ సర్కారుకు ఊరట.. రాహుల్ పై సీరియస్
X
రఫేల్ అంశం పై మోడీ అండ్ కోకు ఊరట లభించింది. 36 యుద్ధ విమానాల కొనుగోలులో అక్రమాలు జరిగినట్లుగా దాఖలైన పిటిషన్ల పైన సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది. 36 యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసే విషయంలో వచ్చిన ఆరోపణల పై విచారించిన సుప్రీం ధర్మాసనం 2018 డిసెంబరులో ఇచ్చిన తీర్పుకు దగ్గరగానే తాజా తీర్పు ఉంది.

నాటి తీర్పు పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా.. అరుణ్ శౌరీలతోపాటు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ లు సైతం కేసులు దాఖలు చేశారు. తాజాగా ఈ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తో కూడిన ధర్మాసనం.. పిటీషన్లను కొట్టి వేస్తూ తీర్పును ప్రకటించింది.

రాఫేల్ ఒప్పందం పై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది. గతంలో క్లీన్ చిట్ ఇవ్వటాన్ని సమీక్షించాలని దాఖలైన రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది. ఇదే సమయంలో.. రఫేల్ ఒప్పందం పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేసింది.

రఫేల్ ఒప్పందం పై ప్రధాని మోడీని ఉద్దేశించి చౌకీదార్ చోర్ హై అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని సుప్రీం తప్పు పట్టింది. రాహుల్ తన విమర్శను సుప్రీంకోర్టు తీర్పునకు అపాదించినట్లు అవుతుందని సుప్రీం ఫైర్ అయ్యింది. చౌకీదార్ చోర్ మై అని రాహుల్ వ్యాఖ్యలు తమకు అపాదించటం సరికాదని.. బ్యాడ్ లక్ గా అభివర్ణించింది.

అయితే.. ఈ కేసుకు సంబంధించి రాహుల్ చెప్పిన క్షమాపణల్ని పరిగణలోకి తీసుకుంది. ఆయన భవిష్యత్తులో మరింత జాగ్రత్త గా ఉండాలని సూచించింది. ఈ సందర్భం గా ఆయన పై దాఖలైన పరువునష్టం దావాను కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రఫేల్ ఇష్యూ పై మోడీ.. రాహుల్ పై దాఖలైన కేసులకు సంబంధించి సుప్రీం తాజాగా ఇచ్చిన తీర్పులతో అంతో ఇంతో రిలాక్స్ అయినట్లుగా చెప్పక తప్పదు.