Begin typing your search above and press return to search.

పన్నులు కట్టేది అభివృద్ధి కోసమే...ఉచితానికి సుప్రీం షాక్

By:  Tupaki Desk   |   3 Aug 2022 11:35 AM GMT
పన్నులు కట్టేది అభివృద్ధి కోసమే...ఉచితానికి సుప్రీం షాక్
X
ప్రజలు చమడోడ్చి కట్టే ప్రతీ పైసా పన్ను రూపంలో సర్కార్ ఖజానాకు చేరుకుంటోంది. అలా వచ్చిన డబ్బును ప్రజల కోసం మౌలిక సదుపాయాలు అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని దేశ అత్యునంత న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఉచితాల పేరిట ప్రజల పన్నుల ఆదాయాన్ని వెచ్చించడం సముచితం కాదని కూడా తేల్చి చెప్పింది. దేశంలో ఉచిత పధకాల మీద దాఖలైన పిటిషన్ మీద ఈ రోజు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అధ్యక్షతన ఉన్న ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.

అదే సమయంలో పలు సూచనలు కూడా చేసింది. ఉచితాలను ఎవరు కోరుకుంటున్నారు అని సుప్రీం కోర్టు ప్రశ్నించడం ఈ సందర్భంగా గమనార్హం. ప్రతీ పార్టీ ఉచిత హామీలతో భారీగా రాజకీయ లబ్ది పొందుతోందని, ఇది మంచి విధానం కాదని, ఆర్ధికంగా కూడా తీవ్రమైన విషయం అని కూడా అభిప్రాయపడింది. ఉచిత హామీలను కట్టడి చేసే దాని మీద కేంద్రం కూడా ముందుకు రావాలని పేర్కొంది.

అలాగే ఉచితాలను నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలు. దాన్ని మోనిటరింగ్ చేయడానికి దేశ స్థాయిలో నియమించాల్సిన అత్యున్నత కమిటీ కూర్పు పై వారం రోజుల్లో సూచనలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం, సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ సహా ఉచితాల మీద కేసు దాఖలు చేసిన పిటీషన్లకు సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఇక అత్యున్నత స్థాయి కమిటీని నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రతినిధులతో ఏర్పాటు చేయాలని కేంద్రానికి సుప్రీం కోర్టు సూచించడం జరిగింది. ఈ విషయంలో తన అభిప్రాయాలను చెప్పాలని కూడా కోరింది. దీని మీద కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ కేంద్రం ఉచితాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు.

ఈ ఆర్ధిక విద్వంసాన్ని కేంద్రం అసలు సమర్ధించదని కూడా ఆయన చెప్పడం విశేషం. మొత్తానికి కేంద్రం ఉచితాలకు వ్యతిరేకంగా ఉంది, సుప్రీం కోర్టు ఘాటు కామెంట్స్ చేసిన నేపధ్యంలో దేశంలో ఉచితాల మీద రాజకీయ పబ్బం గడుపుకునే పార్టీలకు మాత్రం ఈ పరిణామాలు శరాఘాతం అనే చెప్పాల్సి ఉంటుంది.