Begin typing your search above and press return to search.

తాలిబన్ల వేట మొదలు .. వారి కోసం ఇల్లిల్లూ గాలింపు!

By:  Tupaki Desk   |   20 Aug 2021 7:44 AM GMT
తాలిబన్ల వేట మొదలు .. వారి కోసం ఇల్లిల్లూ గాలింపు!
X
తాలిబన్ల పై ఆది నుంచి అనుమానాలే, వారు చెప్పేది ఒకటైతే, చేసేది మరోలా ఉంటుందనే వాదన ఇప్పటిది కాదు. ఇప్పుడు అదే జరుగుతోంది. ఆఫ్ఘనిస్థాన్‌ ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకున్న తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన తాలిబన్ల ప్రతినిధులు, ఇక యుద్ధం ముగిసిందని, అందరనీ క్షమించేశాం,ఇస్లాం చట్టాల ప్రకారం, మహిళలకు కూడా రక్షణ కల్పిస్తాం వంటి..మంచి మంచి మాటలు చెప్పుకొచ్చారు. ఆ స్టేట్‌మెంట్‌ ఇచ్చి రెండు రోజులు గడిచిందో లేదు. అప్పడే, డోర్‌డోర్ తనిఖీలు చేపట్టారు తాలిబన్లు

ఆఫ్ఘ‌నిస్తాన్‌ లో తాలిబ‌న్లు ఇంట్లింట్లో త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. గ‌తంలో నాటో ద‌ళాల‌కు ప‌నిచేసిన వారి కోసం గాలింపు చేప‌డుతున్నారు. వారి కుటుంబ‌స‌భ్యుల‌ను తాలిబ‌న్లు బెరిస్తున్న‌ట్లు యూఎన్ చెప్పింది. ఎటువంటి ప్ర‌తీకారం తీర్చుకోమ‌ని తాలిబ‌న్లు చెప్పినా, ప్ర‌స్తుతం ఆ మిలిటెంట్లు మాన‌వ‌వేట కొన‌సాగిస్తున్న‌ట్లు తెలుస్తోంది. వ్య‌క్తిగ‌తంగా కొంద‌ర్ని తాలిబ‌న్లు టార్గెట్ చేస్తున్నార‌ని, ఆ బెదిరింపులు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని రిప్టో నార్వేయ‌న్ సెంట‌ర్ త‌న నివేదిక‌లో తెలిపింది.

అమెరికా బ‌ల‌గాలు ఆఫ్ఘ‌నిస్తాన్‌ లో ఉన్న స‌మ‌యంలో నాటో ద‌ళాలు కూడా తాలిబ‌న్ల అరాచ‌కాల‌ను నిలువ‌రించాయి. ప్ర‌స్తుతం నాటో దళాలు ఆ దేశం నుంచి వెళ్లిపోయిన నేప‌థ్యంలో వారికి స‌హ‌క‌రించిన వారి కోసం తాలిబ‌న్లు అన్వేషిస్తున్నారు. వాళ్ల‌కు వాళ్లుగా లొంగిపోతే ఏమీ చేయ‌మ‌ని, లేదంటే వాళ్ల‌ను ప‌ట్టుకుని విచారించి, వారి కుటుంస‌భ్యుల‌ను శిక్షిస్తామ‌ని యూఎన్ త‌న రిపోర్ట్‌లో తెలిపింది. తాజాగా భార‌త రాయ‌బార కార్యాల‌యాల్లో సోదాలు చేసి ప‌లు ప‌త్రాలు మాత్ర‌మే కాకుండా అక్క‌డ పార్క్ చేసి ఉన్న కార్ల‌ను సైతం ఎత్తుకెళ్లారు. కాంద‌హార్‌, హీర‌త్ న‌గ‌రాల్లో ఈ ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి.

ఆ ప్రాంతాల్లోని రెండు రాయ‌బార కార్యాల‌యాల్లో అన్ని వ‌స్తువులనూ తాలిబ‌న్లు ప‌రిశీలించారు. మ‌రోవైపు, పౌరుల ఇళ్ల‌లోనూ తాలిబ‌న్లు త‌నిఖీలు చేప‌డుతున్నారు. కాగా, కాబూల్ లో భారత్ ఎంబసీ ఉండగా.. దేశంలోని నాలుగు ఇతర నగరాల్లో కాన్సులేట్స్ వున్నాయి. కొన్ని వారాల క్రిత‌మే భార‌త్ మ‌జార్ యే ష‌రీఫ్ లోని రాయ‌బార కార్యాల‌యాన్ని మూసి వేసింది. ఇప్ప‌టికే ఆఫ్ఘ‌న్ నుంచి భార‌త్ త‌మ సిబ్బందిని వెన‌క్కి తీసుకొచ్చింది.

వేలాది మంది ప్రజలు ఇప్పటికే దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం తమ బిడ్డలనైనా కాపాడాలని ముళ్లకంచెలపై నుండి పిల్లలను విమానాశ్రయాల్లోకి విసిరేస్తున్నారు. ఇక తాజా పరిస్థితులలో ఐక్యరాజ్యసమితి నివేదిక ఆఫ్ఘనిస్థాన్ ప్రజల భయాలను ధృవీకరించింది. AFP గ్లోబల్ న్యూస్ ఏజెన్సీ ఐక్యరాజ్యసమితికి అందిన ఇంటలిజెన్స్ రిపోర్ట్ ను వెల్లడించింది. యూఎస్ మరియు నాటో దళాలతో పనిచేసిన వ్యక్తులను టార్గెట్ చేస్తూ డోర్-టు-డోర్ శోధన తాలిబన్లు నిర్వహిస్తున్నారు. నార్వేజియన్ సెంటర్ ఫర్ గ్లోబల్ ఎనలైసిస్ రాసిన నివేదిక, కాబూల్ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో తాలిబన్ మిలిటెంట్లు కూడా ప్రజలను తనిఖీలు చేస్తున్నట్లుగా వెల్లడించారు.

గతంలో నాటో, యుఎస్ దళాలు మరియు వారి మిత్రులతో కలిసి పనిచేస్తున్నవ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు తాలిబన్ల చేతిలో చిత్రహింసలు ,మరణశిక్షలకు గురవుతారని ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు భయపడుతున్నారు. గతంలో తాలిబన్లు అటువంటి ఆరోపణలను ఖండించిన విషయం తెలిసిందే. తాలిబన్ తీవ్రవాదులు ప్రజల ఇళ్లలోకి ప్రవేశించకుండా నిషేధించామని అనేకసార్లు ప్రకటనలు జారీ చేసింది. కానీ అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నట్లుగా తాజా పరిణామాల ద్వారా వ్యక్తమవుతోంది. ఇంటింటికీ తిరుగుతూ, రోడ్ల మీద వెళ్ళే వారిని కూడా తనిఖీలు చేస్తున్న తాలిబన్ల వైఖరి తీవ్ర ఆందోళనలకు కారణంగా మారుతుంది. 20 సంవత్సరాల విజయాలు వృధాగా పోవడాన్ని అనుమతించ లేని కొందరు తాలిబన్ల పాలనను వ్యతిరేకిస్తున్నారు. మరికొందరు ప్రతిఘటించేందుకు సిద్ధం అవుతున్నారు. ఏదిఏమైనా 20 సంవత్సరాలుగా యూఎస్, నాటో దళాలకు సహకరించి తాలిబన్లపై పోరాటం సాగించిన వారందరూ ఇప్పుడు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఎప్పుడేం జరుగుతుందో అని ఆందోళన పడుతున్నారు.