Begin typing your search above and press return to search.

అమ్మ బైక్ః త‌మిళ‌నాడులో కొత్త స్కీం

By:  Tupaki Desk   |   23 Jan 2018 8:43 PM IST
అమ్మ బైక్ః త‌మిళ‌నాడులో కొత్త స్కీం
X
తమిళనాడు రాష్ట్ర మాజీ సీఎం - దివంగత జయలలితను స్మ‌రించుకునేందుకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం భారీ కార్య‌క్ర‌మానికే శ్రీ‌కారం చుట్టింది. తమిళనాట జయలలితను ‘అమ్మ’గా పిలుస్తారు. దీంతో అనేక ప్రభుత్వ పథకాలకు అమ్మ పేరు పెట్టారు. అమ్మ క్యాంటిన్‌ - అమ్మ ఉప్పు - అమ్మ ల్యాప్‌ టాప్‌ - అమ్మ మిక్సీ - అమ్మ కల్యాణమండపాలు ఇలా అనేక పథకాలు వచ్చాయి. కొద్దికాలం క్రితం తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేయనున్న ఈ-గ్రామాలకు దివంగత జయలలిత పేరు పెట్టనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు. ఇదే రీతిలో మ‌రో కీల‌క పథ‌కం తెర‌మీద‌కు వ‌చ్చింది.

జనాకర్షక పథకాలకు నెలవైన తమిళనాడులో త్వరలో మ‌రో కొత్త‌ పథకం ప్రారంభం కానుంది. అందులోనూ ఇప్ప‌టికే అమ్మ పేరుతో ఉన్న ప‌థ‌కాల‌కు తోడుగా మ‌రో కొత్త ప‌థ‌కం తెర‌మీద‌కు రానుంది. అమ్మ టూవీలర్‌ పథకాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన ఈ పథకాన్ని జయలలిత 70వ జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 24న ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

తాజా స్కీం ప్ర‌కారం మహిళల టూ వీలర్ కొనుగోలుపై 50 శాతం రాయితీ అందించనున్నారు. రూ.2.50 లక్షల లోపు ఆదాయ పరిమితి కలిగి 18-40 ఏళ్ల వయసున్న మహిళలు ఈ పథకానికి అర్హులు. 125 సీసీలోపు ఉన్న స్కూటర్లు - మోపెడ్ల కొనుగోలుకు ఈ పథకం వర్తిస్తుంది. వాహన ధరలో 50 శాతం లేదా రూ.25వేల రాయితీని ప్రభుత్వం ఈ పథకం కింద అందించనుంది. కుటుంబాన్ని పోషించే మహిళ - వితంతు - దివ్యాంగ మహిళలకు - హిజ్రాలకు ప్రాధాన్యం ఈ పథకంలో ఇవ్వనున్నారు. కుటుంబానికి ఒక్కరికి మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం వెల్లడించింది.