Begin typing your search above and press return to search.

మేం నడుస్తాం.. టీ కాంగ్రెస్ సీనియర్ల పాదయాత్రలట!

By:  Tupaki Desk   |   14 Dec 2020 4:22 PM GMT
మేం నడుస్తాం.. టీ కాంగ్రెస్ సీనియర్ల పాదయాత్రలట!
X
పాదయాత్ర.. తెలుగు నాట పవర్ ఫుల్ యాత్ర. రెండు సార్లు సీఎంగా అప్రతిహతంగా దూసుకొచ్చిన చంద్రబాబును ఇదే పాదయాత్ర చేసి నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గద్దె దింపారు. ఆ తర్వాత చంద్రబాబు పాదయాత్ర చేసి 2014లో ఏపీ సీఎం అయ్యారు. ఇక గత ఎన్నికల్లో ఓడిన వైఎస్ జగన్ ఈసారి పాదయాత్ర చేసి ఏకంగా 151 ఎమ్మెల్యే 22 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు.

అందుకే పాదయాత్రను మించిన ఆయుధం రాజకీయాల్లో లేదు. ఇప్పుడు ఇదే తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్ష నేతలకు ఆయుధమైంది. ఖాళీ అయిన తెలంగాణ పీసీసీ పదవి కోసం ఇప్పుడు పాదయాత్రనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయుధంగా వాడుతున్నారు.

తాజాగా తనను పీసీసీ ప్రెసిడెంట్ చేస్తే ప్రతి ఇంటికి పాదయాత్ర చేసి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తానని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశాడు.

ఇది మరువక ముందే రేవంత్ కు ప్రధాన పోటీదారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాదయాత్రకు సై అన్నాడు. దివంగత వైఎస్ఆర్ లాగానే తాను పాదయాత్ర చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తెస్తానని.. తనకే పీసీసీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

వీరిద్దరి మధ్యలోకి జగ్గారెడ్డి సైతం తానేమీ తక్కువ కాదని వచ్చేశాడు. రైతులు, జనాల సమస్యలు తెలుసుకునేందుకే తొందరలో పాదయాత్ర చేయబోతున్నానని జగ్గారెడ్డి ప్రకటించారు.

ఇలా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు.. ఎన్నికల్లో గెలుపు కోసం రాని ఈ నేతలు ఇప్పుడు పీసీసీ పదవి.. దాన్నుంచి లభించే సీఎం సీటు కోసం అందరూ రెడీ అవుతున్నారు. ఈ తపన పార్టీని బాగు చేయడానికి వాడితే కాంగ్రెస్ కు ఈ దుస్థితి వచ్చేది కాదు కదా అని హార్డ్ కోర్ కాంగ్రెస్ వాదులు చర్చించుకుంటున్నారు.