Begin typing your search above and press return to search.

ఏడాది క్రితం సోషల్ మీడియాలో పోస్ట్.. ఇప్పుడు కేసు.. టీడీపీ నేత ఆత్మహత్య

By:  Tupaki Desk   |   9 March 2022 3:29 AM GMT
ఏడాది క్రితం సోషల్ మీడియాలో పోస్ట్.. ఇప్పుడు కేసు.. టీడీపీ నేత ఆత్మహత్య
X
ఏపీలో అధికార వైసీపీ తగ్గేదేలే అంటూ వదలడం లేదు. ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేలా పోస్టులు పెట్టేవారిని వెంటాడి మరీ కేసులు నమోదు చేస్తోంది. ఏడాది క్రితం పెట్టిన సోషల్ మీడియా పోస్టుపై తాజాగా కేసు నమోదు చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన టీడీపీ నేత ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

గత ఏడాది పంచాయతీ ఎన్నికల సమయంలో టెక్కలి నియోజకవర్గ వైసీపీ నేతపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టారని టీడీపీ సోషల్ మీడియా సభ్యుడు కోన వెంకటరావుపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం వెంకటరావు ఇంటికి చేరుకున్న టెక్కలి, మందస పోలీసులు ఆయన ఇంటిలో లేకపోవడంతో పోలీస్ స్టేషన్ కు రావాల్సి ఉంటుందని ఆయన భార్య కృష్ణవేణిని హెచ్చరించి వెళ్లిపోయారు.

ఆ తర్వాత ఇంటికి చేరుకున్న భర్తకు కృష్ణవేణి విషయం చెప్పడంతో మనస్తాపం చెందిన వెంకటరావు రాత్రి 7 గంటల సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.గమనించిన కుటుంబ సభ్యులు పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

టీడీపీ నేతలు, కార్యకర్తలు నిన్న ఉదయం ఆసుపత్రికి చేరుకొని ఆందోళనకు దిగారు. పోలీసుల వేధింపులు భరించలేకే వెంకటరావు ఆత్మహత్య చేసుకున్నారని.. మంత్రి అప్పలరాజు ఒత్తిడితో ఇలా చేశారని ఆరోపించారు. వెంకటరావు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీఎస్పీ శివరామిరెడ్డి టీడీపీ నేతలతో చర్చలు జరిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో అంత్యక్రియలు నిర్వహించారు.

ఘటనపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. పోలీసులు, వైసీపీ నేతలపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.