Begin typing your search above and press return to search.

ఆ న‌టి ఇంట్లో 31 ఎల్ఐసీ ప‌త్రాలు.. నామినీగా ఆ మంత్రి!

By:  Tupaki Desk   |   7 Aug 2022 11:44 AM GMT
ఆ న‌టి ఇంట్లో 31 ఎల్ఐసీ ప‌త్రాలు.. నామినీగా ఆ మంత్రి!
X
ప‌శ్చిమ బెంగాల్ ఉపాధ్యాయుల నియామ‌క కుంభ‌కోణానికి సంబంధించి తృణ‌మూల్ కాంగ్రెస్ నేత, ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కేబినెట్ లో మంత్రి పార్థా ఛ‌ట‌ర్జీని, ఆయ‌నకు అత్యంత స‌న్నిహితురాలు, సినీ న‌టి, మోడ‌ల్ అర్పితా ముఖ‌ర్జీని ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కుంభ‌కోణంలో అర్పిత రెండు ఫ్లాట్ల నుంచి దాదాపు 50 కోట్ల రూపాయలను ఈడీ ఇప్ప‌టికే స్వాధీనం చేసుకుంది. కాగా ఆ డ‌బ్బు త‌మ‌ది కాదంటే త‌మ‌ది కాద‌ని పార్థా చ‌ట‌ర్జీ, అర్పిత ఇద్దరూ ఈడీ విచార‌ణ‌లో చెప్పార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కాగా వీరిద్ద‌రి వ్య‌వ‌హారంపై లోతుగా విచారిస్తున్న ఈడీ వారి ఇళ్ళు, సంస్థల కార్యాలయాల్లో సోదాలు చేసి అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

కాగా పార్థా ఛ‌ట‌ర్జీ, అర్పిత ముఖ‌ర్జీ మ‌ధ్య అత్యంత స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని ఈడీ తేల్చింది. అంతేకాకుండా వీరిద్ద‌రూ అనేక డొల్ల కంపెనీలు న‌డుపుతున్నార‌ని, ఆ డొల్ల కంపెనీల ద్వారా బ్లాక్ మ‌నీని వైట్ మ‌నీగా మార్చార‌ని స్ప‌ష్టం చేసింది. ప‌ది రోజుల ఈడీ క‌స్టడీ పూర్తి కావ‌డంతో వారిద్దిర‌నీ ఈడీ అధికారులు ప్ర‌త్యేక కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. విచార‌ణ సంద‌ర్భంగా అర్పిత ముఖ‌ర్జీ పేరిట 31 ఎల్ఐసీ పాల‌సీలు ఉన్నాయ‌ని.. ఒక్కొక్క పాల‌సీకి ఏటా 50 వేల రూపాయ‌ల చొప్పున ప్రీమియం క‌డుతున్నార‌ని ఈడీ పేర్కొంది. అంతేకాకుండా ఈ 31 పాల‌సీల‌కు నామినీగా పార్థా చ‌ట‌ర్జీ ఉండ‌టం విస్తుగొలుపుతోంద‌ని ఈడీ తెలిపింది. దీన్ని బ‌ట్టే వీరిద్ద‌రి మ‌ధ్య సంబంధాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చంటున్నారు.

ఇప్పటికే పార్థా చ‌ట‌ర్జీ, అర్పిత ముఖ‌ర్జీ పేర్లపై ఉన్న ఉమ్మడి ఆస్తులను గుర్తించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఇద్ద‌రి మధ్య స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని ఈడీ చెబుతోంది. విచార‌ణ‌లో త‌మ‌కు అర్పిత ముఖ‌ర్జీ స‌హ‌క‌రిస్తోంద‌ని అధికారులు చెబుతున్నారు. పార్థా చ‌ట‌ర్జీ మాత్రం అమాయ‌క‌త్వాన్ని న‌టిస్తున్నాడ‌ని అంటున్నారు. ఏ ప్ర‌శ్న అడిగినా త‌న‌కు తెలియ‌దు.. గుర్తు లేదు.. మ‌రిచిపోయాను అని మాత్ర‌మే పార్థా చెబుతున్నాడ‌ని ఈడీ అంటోంది.