Begin typing your search above and press return to search.

టీమిండియాలో ఎన్నడూ లేని ఈ చిత్రం గమనించారా?

By:  Tupaki Desk   |   18 Jun 2022 2:30 AM GMT
టీమిండియాలో ఎన్నడూ లేని ఈ చిత్రం గమనించారా?
X
టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ ఆడుతోంది. ఐదు మ్యాచ్ ల పెద్ద సిరీస్ లో ఇప్పటికే మూడు పూర్తయ్యాయి. శుక్రవారం గుజరాత్ లోని రాజ్ కోట్ లో నాలుగో మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే.. సిరీస్ 2-2తో నిలుస్తుంది. ఓడితే మాత్రం సిరీస్ కోల్పోయినట్లే. చివరి మ్యాచ్ ఈ నెల 19న బెంగళూరులో జరుగుతుంది. శుక్రవారం నాటి మ్యాచ్లో టీమిండియా గెలుపు సాధిస్తే.. సిరీస్ 2-2తో ఉంటుంది. వచ్చే ఆదివారం జరిగే మ్యాచ్ ఫైనల్ కాని ఫైనల్ అవుతుంది.

పంత్ పైనే ఒత్తిడంతా..?

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ప్రస్తుతం జట్టు సారథిగా బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. ప్రధాన ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్, రాహుల్, కోహ్లి దూరమైన నేపథ్యంలో పంత్ కు మంచి అవకాశం దక్కింది. అయితే, అతడు మూడు టి20ల్లోనూ పెద్దగా ఆకట్టుకున్నది లేదు. అంతేకాదు.. తొలి రెండు మ్యాచ్ ల్లో కెప్టెన్సీ వైఫల్యాలు కనిపించాయి. పంత్ కూడా మూడో మ్యాచ్ కు ముందు ఒత్తిడిలో చిక్కుకున్నట్లు కనపించాడు. బ్యాటింగ్ లోనూ దీని ప్రభావం కనిపించింది. కానీ, మూడో మ్యాచ్ లో జట్టు విజయంతో అదంతా మరుగునపడింది. పంత్ కు కూడా కొంత
ఊరట లభించింది.

బ్యాట్ కు పని చెప్పేదెప్పుడు?

పంత్ విధ్వంసక ఆటగాడు. అందులో సందేహం లేదు. కానీ, కెప్టెన్సీ భారంతోనే ఏమో సరిగా రాణించలేకపోతున్నాడు. మూడు టి20ల్లోనూ అతడు చేసింది తక్కువ పరుగులే. 29, 5, 6..ఇవీ అతడి స్కోర్లు. కీలక సమయంలో.. అది కూడా పిచ్చి షాట్ లతో వికెట్ పారేసుకునే ధోరణిని అతడు మార్చుకోవడం లేదు. ఇక కెప్టెన్ గానూ అదే పని చేస్తే పంత్ భవిష్యత్ కు దెబ్బ.కాగా, టీమిండియాలో పంత్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కాగా.. అతడిలాగే పూర్తి స్థాయి వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ లు మరో ఇద్దరు ఉండడం గమనార్హం.

కిషన్, కార్తీక్

దినేశ్ కార్తీక్.. 36 ఏళ్ల ఈ వెటరన్ అద్భుత రీతిలో టీమిండియాలోకి మళ్లీ వచ్చాడు. చిత్రమేమిమిటంటే.. ఇదే దక్షిణాఫ్రికాతో 2006 డిసెంబరు 1న జరిగిన టీమిండియా తొట్ట తొలిఅంతర్జాతీయ టి20లో కార్తీక్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. నాడు కూడా ఇప్పటిలానే ఫినిషర్ పాత్ర పోషించాడు తను. అయితే, కార్తీక్ కెరీర్ ఎత్తుపల్లాల గురించి వేరే సందర్భంలో చెప్పుకొందాం.ఈ సిరీస్ కు మాత్రం అతడిని ఫినిషర్ గానే తీసుకున్నారు.

ఆరో స్థానంలో బ్యాటింగ్ కు దింపుతున్నారు. ఇక మరో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్. పూర్తి స్థాయి కీపర్ అయినకిషన్.. ఎడమ చేతి వాటం హార్డ్ హిట్టర్. భవిష్యత్ లో పంత్ కు ఇతడితో తీవ్ర పోటీ తప్పదు. పంత్ లో లేని నిలకడ కిషన్ సొంతం. అంటే.. టీమిండియా ముగ్గురు నిఖార్సయిన కీపర్లతో తుదిజట్టును ఆడిస్తోంది.

గతంలో బహుశా ఎన్నడూ ఇలా జరిగి ఉండకపోవచ్చు. అన్నట్లు.. కెప్టెన్ గా ప్రకటితమై గాయంతో ఈ సిరీస్ కు దూరమైన కేఎల్ రాహుల్ కూడా వికెట్ కీపర్ అనే సంగతి మరువొద్దు. కాకపోతే అతడు పార్ట్ టైం కీపర్. ఒకవేళ అతడు ఈ సిరీస్ ఆడి ఉంటే గనుక నలుగురు కీపర్లతో టీమిండియా బరిలో దిగినట్లయ్యేది. చిత్రం కదూ..?